Suvendu Adhikari: నేడే సువేందు అధికారి ప్రమాణ స్వీకారం
- Author : Vamsi Chowdary Korata
Date : 09-05-2026 - 11:21 IST
Published By : Hashtagu Telugu Desk
పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రలో ఇదొక చారిత్రాత్మక మలుపు. దశాబ్దాల కాలంగా కమ్యూనిస్టులు, ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ ఏలిన బెంగాల్ గడ్డపై మొదటిసారిగా బీజేపీ ప్రభుత్వం కొలువుదీరడం జాతీయ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. సువేందు అధికారి బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు.
రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్. రవిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధతను తెలియజేసిన సువేందు అధికారి, కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ మైదానంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ… పార్టీ వ్యవస్థాపక పితామహుల (శ్యామా ప్రసాద్ ముఖర్జీ వంటి వారు) కలలను నెరవేర్చిన సంతృప్తి కనిపిస్తోందని అన్నారు. దశాబ్దాల పాలనకు ముగింపు పలుకుతూ, కేంద్రం, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉండే ‘డబుల్ ఇంజిన్’ సర్కార్ ద్వారా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ‘అభివృద్ధి, శాంతి మరియు శ్రేయస్సు అనే మూడు సూత్రాల ఆధారంగా ‘సోనార్ బంగ్లా’ (బంగారు బెంగాల్) నిర్మాణానికి ఈ ప్రభుత్వం నాంది పలుకుతుందని సువేందు అధికారి స్పష్టం చేశారు.
మరోవైపు, ప్రమాణస్వీకార కార్యక్రమానికి స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరవుతున్నారు. కోల్కతా నగరం ప్రస్తుతం పండుగ వాతావరణంలో ఉంది.