Supreme Court : పంట వ్యర్థాల దహనం.. పంజాబ్, హర్యానా ప్రభుత్వాలపై సుప్రీం ఆగ్రహం
Supreme Court : ఎన్సీఆర్ పరిధిలో కాలుష్య నియంత్రణ కోసం కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (CAQM) ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ జరిపింది. ఈ సందర్భంగా పంజాబ్, హర్యానా ప్రభుత్వాల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేసింది.
- By Latha Suma Published Date - 01:33 PM, Wed - 16 October 24

Punjab-Haryana Government : పంజాబ్, హర్యానా ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేసింది. పంట వ్యర్థాల దహనం విషయంలో తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఆ రాష్ట్రాలు ఎలాంటి సమర్థవంతమైన చర్యలు తీసుకోవడం లేదని మండిపడింది. ఈ విషయంలో తాము గతంలో జారీ చేసిన ఉత్తర్వులను పాటించకపోతే కోర్టు ధిక్కరణగా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించింది.
ఎన్సీఆర్ పరిధిలో కాలుష్య నియంత్రణ కోసం కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (CAQM) ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ జరిపింది. ఈ సందర్భంగా పంజాబ్, హర్యానా ప్రభుత్వాల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ”ఇది రాజకీయ అంశం కాదు. హర్యానా దాఖలు చేసిన అఫిడవిట్ చూశాం. అందులో మా ఆదేశాలు పాటిస్తున్నట్లు లేదు. సీఏక్యూఎం ఆదేశాలను ఉల్లంఘించి పంట వ్యర్థాల దహనానికి (Stubble burning) పాల్పడుతున్నవారిపై పంజాబ్ ప్రభుత్వం గత మూడేళ్లుగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఎందుకు?” అని ధర్మాససం ప్రశ్నించింది.
”పంట వ్యర్థాల దహనం కారణంగా ఏ ప్రాంతంలో మంటలు చెలరేగుతున్నాయో, ఎంత పరిమాణంలో ఉన్నాయో.. ఇలా అన్ని వివరాలను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మీకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూనే ఉంది. అలాంటప్పుడు మంటలు చెలరేగిన ప్రాంతాలను గుర్తించకలేకపోతున్నామని మీరు చెప్పడం సరికాదు. కేవలం నామమాత్రంగా జరిమానాలు విధిస్తామంటే సరిపోదు. కఠిన చర్యలు తీసుకోవాలి” అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఉల్లంఘనల కట్టడిలో విఫలమైనందుకు గానూ పంజాబ్, హర్యానా ప్రభుత్వ అధికారులపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని గాలి నాణ్యతా మేనేజ్మెంట్ కమిషన్ను ఆదేశించింది. అంతేగాక.. అక్టోబరు 23న ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరై దీనిపై వివరణ ఇవ్వాలని సమన్లు జారీ చేసింది. కాగా, దేశ రాజధాని ఢిల్లీలో ప్రతీ శీతాకాలం గాలి నాణ్యత దారుణంగా పడిపోతూ ఉంటుంది. దీనికి పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానాల్లో పంట వ్యర్థాల దహనమే ప్రధాన కారణంగా మారుతోంది. దీనిపై కొంతకాలంగా సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది.