CJP Protest Delhi: ఢిల్లీ పోలీసులపై రాళ్ల దాడి
- Author : Vamsi Chowdary Korata
Date : 21-07-2026 - 10:30 IST
Published By : Hashtagu Telugu Desk
రాజధాని ఢిల్లీలోని చారిత్రక నిరసన ప్రాంతం జంతర్ మంతర్ వద్ద CJP (సిటిజన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్) చేపట్టిన ఆందోళన కార్యక్రమం ఒక్కసారిగా హింసాత్మకంగా మారింది. నిరసనకారులు హద్దులు దాటి జరిపిన తీవ్రమైన రాళ్లదాడిలో సుమారు 118 మంది పోలీసు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారని ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. బాధితుల్లో కేవలం క్షేత్రస్థాయి సిబ్బంది మాత్రమే కాకుండా స్పెషల్ కమిషనర్, జాయింట్ కమిషనర్, అడిషనల్ కమిషనర్ స్థాయికి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారులు మరియు పలువురు మహిళా పోలీసులు కూడా ఉన్నారని పోలీసులు ధృవీకరించారు. నిరసనను అదుపు చేసే క్రమంలోనే ఈ ఊహించని దాడి జరిగిందని అధికారులు పేర్కొన్నారు.
ఆందోళనకారులు ప్రజా ఆస్తులను లక్ష్యంగా చేసుకుని విద్వంసానికి పాల్పడ్డారని, సుమారు 15 నుంచి 20 ప్రభుత్వ వాహనాలను, పోలీసు బస్సులను పూర్తిగా ధ్వంసం చేశారని సమాచారం. ఉద్రిక్త పరిస్థితుల నడుమ నిరసనకారులను అదుపు చేసేందుకు అదనపు బలగాలను మోహరించారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన శాంతిభద్రతల విభాగం, ఆందోళన ప్రాంతంలో ఉన్న ప్రైవేట్ మరియు ప్రభుత్వ సీసీటీవీ (CCTV) కెమెరా దృశ్యాలు, అలాగే సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైన మొబైల్ వీడియోలను కూలంకషంగా పరిశీలిస్తోంది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని హింసకు పాల్పడిన బాధ్యులను త్వరలోనే గుర్తించి, వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.