Karnataka: సీఎం, డిప్యూటీ సీఎం మధ్య విభేదాల ప్రచారానికి చెక్
Karnataka: కర్ణాటకలో సీఎం మార్పు జరుగుతుందన్న ఊహాగానాలకు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్వీ దేశ్పాండే ముగింపు పలికారు.
- By Kavya Krishna Published Date - 01:55 PM, Mon - 30 June 25

Karnataka: కర్ణాటకలో సీఎం మార్పు జరుగుతుందన్న ఊహాగానాలకు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్వీ దేశ్పాండే ముగింపు పలికారు. సోమవారం ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రానికి నేతృత్వం వహిస్తున్న సిద్ధరామయ్య ఐదేళ్ల కాలపరిమితి వరకూ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని స్పష్టం చేశారు. పార్టీ లోపల ఎలాంటి నాయకత్వ మార్పు చర్చలు జరగలేదని స్పష్టంచేశారు.
ఇటీవల కర్ణాటక కాంగ్రెస్లో అంతర్గత అసమ్మతులు, అవినీతి ఆరోపణలు, పాలనపై అసంతృప్తి వాదనలు మునిగిపోయాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య , ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య విభేదాలు ఉన్నట్లు ప్రచారం జోరుగా సాగింది. ఈ నేపథ్యంలో పార్టీ హైకమాండ్ నేతృత్వ మార్పు నిర్ణయం తీసుకుంటుందనే వార్తలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.
ఈ నేపథ్యంలో దేశ్పాండే స్పందిస్తూ, “సిద్ధరామయ్య ఐదేళ్లపాటు సీఎం పదవిలోనే ఉంటారు. నాయకత్వ మార్పునకు సంబంధించి ఎటువంటి చర్చా, ప్రతిపాదనా పార్టీ స్థాయిలో జరగలేదు. శాసనసభా పక్ష సమావేశాల్లో కూడా ఈ అంశం ఎప్పుడూ ప్రస్తావనకు రాలేదు. మేమంతా ఒకటే టీం లాగా పని చేస్తున్నాం,” అని తెలిపారు. దేశ్పాండే ప్రకటనతో కర్ణాటక కాంగ్రెస్లో చర్చకు దారి తీసిన వదంతులకు తాత్కాలికంగా తెరపడినట్లయింది.
Weather Alert: ఉత్తరాది రాష్ట్రాల్లో వర్ష బీభత్సం.. రెడ్ అలర్ట్ జారీ