Pump & Dump: నటుడు అర్షద్ వార్సి దంపతులపై సెబీ కొరడా.. యూట్యూబ్ వీడియోలతో “పంప్ & డంప్”
యూట్యూబ్ ఛానెళ్లను ఉపయోగించి "పంప్ & డంప్" స్టాక్ మార్కెట్ స్కీమ్ ను నడిపారనే అభియోగాలను బాలీవుడ్ నటుడు
- By Maheswara Rao Nadella Published Date - 09:30 AM, Sat - 4 March 23

యూట్యూబ్ ఛానెళ్లను ఉపయోగించి “పంప్ & డంప్” (Pump & Dump) స్టాక్ మార్కెట్ స్కీమ్ ను నడిపారనే అభియోగాలను బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి, ఆయన భార్య మరియా గోరెట్టి ఎదుర్కొం టున్నారు. దీంతో వారిద్దరు షేర్ల ట్రేడింగ్ చేయకుండా స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నిషేధం విధించింది. షేర్ల ధరలను కృత్రిమంగా పెంచినందుకుగానూ సాధ్నా బ్రాడ్కాస్ట్ కంపెనీ ప్రమోటర్లు సహా 31 సంస్థలను బ్యాన్ చేసింది. అర్షద్ వార్సీ, అతని భార్య మరియా గోరెట్టితో సహా మరో 44 మందిని షేర్ మార్కెట్ నుంచి ఒక సంవత్సరం పాటు నిషేధించింది. కొన్ని కంపెనీల షేర్ల ధరల్లో పంప్ & డంప్ (Pump & Dump) జరిగినట్లు 2022 ఏప్రిల్ – సెప్టెంబర్ మధ్య కాలంలో SEBIకి ఫిర్యాదులు అందాయి. విచారణ జరిపిన సెబీ ఈమేరకు నిర్ణయాలు ప్రకటించింది.
ఇంతకీ ఏం చేశారు?
సాధ్నా బ్రాడ్కాస్ట్ లిమిటెడ్, షార్ప్లైన్ బ్రాడ్కాస్ట్ లిమిటెడ్ కంపెనీల షేర్లను కొనుగోలు చేయండంటూ అర్షద్ వార్సీ, అతని భార్య మరియా గోరెట్టి ప్రచారం చేశారు. ఇందుకోసం 2022 జులై నెలలో “ది అడ్వైజర్” “మనీవైస్” అనే రెండు YouTube ఛానెళ్లలో వీడియోలు అప్లోడ్ చేశారు. ఇవి విడుదలైన తర్వాత, షేర్ ధర & వాల్యూమ్లో విపరీతమైన జంప్ కనిపించింది. యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియో చూసిన రిటైల్ ఇన్వెస్టర్లు పెద్ద సంఖ్యలో ఈ కంపెనీ షేర్లలో పెట్టుబడులు పెట్టారు. సాధ్నా బ్రాడ్కాస్ట్ ప్రమోటర్లకు కూడా ఈ మోసంలో భాగం ఉందని సెబీ నిర్ధారించింది. వీళ్లంతా కలిసి యూట్యూబ్ వీడియోల ద్వారా మదుపర్లకు ఆ రెండు స్టాక్స్ సిఫారసు చేసి వాటి ధరల్ని కృత్రిమంగా పెంచారని తేల్చింది. “పంప్ & డంప్” స్కీమ్ ద్వారా అర్షద్ వార్సీ రూ. 29.43 లక్షలు, అతని భార్య మరియా రూ. 37.56 లక్షలు, ఇక్బాల్ హుస్సేన్ వార్సి రూ. 9.34 లక్షలు సంపాదించారని సెబీ వెల్లడించింది. ఈవిధంగా అక్రమంగా లాభ పడినందుకు ఈ మోసగాళ్లందరికీ సెబీ రూ. 41.85 లక్షల జరిమానా విధించింది. వాళ్లు అక్రమంగా సంపాదించిన రూ. 54 కోట్ల లాభాలను కూడా స్వాధీనం చేసుకుంది.
పంప్ & డంప్ (Pump & Dump) స్కీమ్ అంటే..?
ఒక కంపెనీ చేసే వ్యాపారం, ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా, స్టాక్ ధరను పెంచేలా చేసే మోసాన్నే “పంప్ & డంప్” స్కీమ్ అంటారు. అంటే, ఆ కంపెనీ స్టాక్స్ లో కొందరు ముందుగా పెట్టుబడులు పెట్టి, ఆ తర్వాత దాని గురించి ప్రచారం చేస్తారు. దాని గురించి యూట్యూబ్ సహా ఇతర వెబ్సైట్స్లో విపరీతంగా యాడ్స్ ఇస్తారు. ఆ స్టాక్ ధర భారీగా పెరగబోతోందని అంచనాలు పెంచుతారు. ఇప్పుడు తక్కువ ధరలో కొంటే కాసుల పంటే అని నమ్మిస్తారు. స్టాక్ మార్కెట్ యూట్యూబర్లు, రిపోర్టర్లకు కూడా డబ్బులు పంచి ఇదంతా పాజిటివ్గా చెప్పిస్తారు. దీంతో కొన్ని రోజుల పాటు ఆ స్టాక్ ధర పెరుగుతూ వెళ్తుంది. ఈక్రమంలో ధర ఒక స్థాయికి చేరిన తర్వాత ఆ స్టాక్ను మోసపూరిత పెట్టుబడిదార్లు అమ్మేసి, భారీ లాభాలు ఆర్జిస్తారు. ఫలితంగా అమాయక ఇన్వెస్టర్లు, అత్యాశపడే ఇన్వెస్టర్లు నష్టపోతారు.
Also Read: Sukanya Samriddhi Yojana: ఈ పథకంలో అత్యధిక శాతం వడ్డీ పొందే అవకాశం

Related News

Deer-Leopard: వామ్మో.. తెలివైన జింక.. ప్రాణాలు పోయినట్లు నటించి చిరుత నుండి ఎలా తప్పించుకుందో చూడండి?
మామూలుగా చిరుత పులికి జింక కనిపిస్తే చాలు ఆరోజు దానికి పండగ అని చెప్పాలి. కానీ దొరికిపోయిన జింకకు మాత్రం అదే చివరి రోజు. పొరపాటున పులి కంట పడితే ఆ జింక ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే.