Heavy Rains: ముంబైని ముంచెత్తుతున్న వర్షాలు
- Author : Vamsi Chowdary Korata
Date : 07-07-2026 - 12:19 IST
Published By : Hashtagu Telugu Desk
మహారాష్ట్రలోని పుణే జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. పశ్చిమ ఘాట్లలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన లోనావాలో కేవలం 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో 670 మిల్లీమీటర్ల (67 సెంటీమీటర్లు) అత్యంత భారీ వర్షపాతం నమోదైనట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. క్లౌడ్ బరస్ట్ (మేఘమథనం) తరహాలో కురిసిన ఈ వానతో పాటు, చుట్టుపక్కల ఉన్న భిరా, తంహిని, షిర్గాన్, అంబోన్, ఖోపోలి వంటి ఘాట్ ప్రాంతాలలో కూడా 500 మి.మీ. కంటే ఎక్కువ వర్షం కురిసింది. ఈ కొండ ప్రాంతాల నుండి ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీరంతా కృష్ణా నదికి ప్రధాన ఉపనది అయిన భీమా నదిలోకి పోటెత్తుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమై, నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మహారాష్ట్ర ఎగువన కురుస్తున్న ఈ అసాధారణ వర్షాల ప్రభావం ఇప్పుడు కర్ణాటక, తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టులపై స్పష్టంగా కనిపిస్తోంది. భీమా నది గుండా వస్తున్న వరద ప్రవాహం.. జూరాల ప్రాజెక్టుకు ఎగువన తెలంగాణ సరిహద్దుల్లో కృష్ణా నదిలో కలుస్తుంది. మరోవైపు, ఎగువన ఉన్న కర్ణాటకలోని ప్రసిద్ధ ఆల్మట్టి డ్యామ్కు ప్రస్తుతం 80,000 క్యూసెక్కుల భారీ ఇన్ఫ్లో (వరద నీరు) వస్తోంది. కృష్ణా బేసిన్ పరిధిలోని ఉపనదులు మరియు క్యాచ్మెంట్ ఏరియాల నుండి వరద ఉధృతి గంటగంటకూ పెరుగుతుండటంతో, రాబోయే రోజుల్లో నారాయణపూర్, జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు వరద నీరు భారీగా వచ్చే అవకాశం ఉందని కేంద్ర జలసంఘం అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో నదీ తీర ప్రాంతాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.