Amritpal Vs Mann : ఎంపీ అమృత్పాల్ నుంచి పంజాబ్ సీఎంకు ప్రాణహాని.. కోర్టులో అఫిడవిట్
ఎంపీగా ఎన్నికైన ఖలిస్తాన్ వేర్పాటువాది అమృత్పాల్ సింగ్ నుంచి పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్కి ప్రాణహాని ఉందని పంజాబ్ పోలీసులు (Amritpal Vs Mann) వెల్లడించారు.
- By Pasha Published Date - 07:16 PM, Sun - 22 September 24

Amritpal Vs Mann : పంజాబ్కు చెందిన అమృత్పాల్ సింగ్.. ఖలిస్తాన్ మద్దతుదారుడు. అయినా పంజాబ్లోని ఖదూర్ సాహిబ్ లోక్సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఎంపీగా గెలిచాడు. ఇతర పార్టీల అభ్యర్థులను ఓడించి మరీ అక్కడి ప్రజలు అమృత్పాల్ సింగ్ను ఎంపీగా గెలిపించుకున్నారు. అమృత్పాల్ ఖలిస్తాన్ వేర్పాటువాది అని తెలిసి కూడా ఖదూర్ సాహిబ్ లోక్సభ స్థానం ప్రజలు అమృత్పాల్ వైపే మొగ్గుచూపడం గమనార్హం. ఈనేపథ్యంలో పంజాబ్లోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం అలర్ట్ అయింది.
Also Read :Satyapal Malik : బీజేపీ శవపేటికకు మహారాష్ట్ర చివరి మేకు అవుతుంది : సత్యపాల్ మాలిక్
ఎంపీగా ఎన్నికైన ఖలిస్తాన్ వేర్పాటువాది అమృత్పాల్ సింగ్ నుంచి పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్కి ప్రాణహాని ఉందని పంజాబ్ పోలీసులు (Amritpal Vs Mann) వెల్లడించారు. అమృత్పాల్, అతడి సన్నిహితుల వల్ల రాష్ట్రంలో శాంతిభద్రతలు దెబ్బతినే రిస్క్ ఉందని తెలిపారు. గతంలో అమృత్పాల్ సింగ్ చేసిన ప్రసంగాలకు సంబంధించిన వీడియో క్లిప్లే తాము చేసిన ఈ హెచ్చరికలకు నిదర్శనాలు అని పంజాబ్ పోలీసు విభాగం పేర్కొంది.
Also Read :Public Reaction on HYDRA: సంగారెడ్డిలో హైడ్రా కూల్చివేతలపై నివాసితుల బాధలు వర్ణనాతీతం
పంజాబ్ పోలీసులు ఈవివరాలను మీడియాకు చెప్పలేదు. ఏకంగా పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ఎదుట ఈమేరకు వాదనలను వినిపించారు. ఈమేరకు వాదనలతో కూడిన అఫిడవిట్ను కోర్టు ఎదుట అమృత్సర్(రూరల్) ఎస్ఎస్పీ చరణ్జిత్ సింగ్ సమర్పించారు. ‘‘దివంగత పంజాబ్ మాజీ సీఎం బియాంత్ సింగ్కు పట్టిన గతే భగవంత్ మాన్కు పడుతుంది’’ అని అమృత్పాల్ సింగ్ వార్నింగ్ ఇవ్వడం ఓ వీడియోలో స్పష్టంగా ఉందని ఆ అఫిడవిట్లో ప్రస్తావించారు. ‘‘బియాంత్ సింగ్ మార్గంలోనే సీఎం మాన్ పనిచేస్తున్నారు. మానవబాంబుతో భగవంత్ మాన్ని హత్య చేస్తాం’’ అని ఆ వీడియోలో స్పష్టంగా అమృత్పాల్ బెదిరించారు. ఈ వీడియో క్లిప్ను పంజాబ్ పోలీసులు కోర్టుకు సమర్పించారు. 2023 ఫిబ్రవరిలో అజ్నాలా పోలీస్ స్టేషన్ సంఘటన చోటుచేసుకుంది. ఆ తర్వాత అజ్నాలా పోలీస్ స్టేషన్ వెలుపల మాట్లాడుతూ అమృత్పాల్ ఈ వార్నింగ్ ఇచ్చారని కోర్టుకు పంజాబ్ పోలీసులు వివరించారు.