One Nation One Election : జేపీసీ కమిటీలో ప్రియాంక గాంధీకి చోటు ..!
TDP నుంచి హరీశ్ బాలయోగి, DMK-విల్సన్, సెల్వ గణపతి, JDU-సంజయ్ ఝా, SP-ధర్మేంద్ర యాదవ్, శివసేన(శిండే)-శ్రీకాంత్ శిండే, TMC నుంచి కళ్యాణ్ బెనర్జీ, సాకేత్ గోఖలేకు అవకాశం దక్కుతుందని సమాచారం.
- Author : Latha Suma
Date : 18-12-2024 - 5:36 IST
Published By : Hashtagu Telugu Desk
One Nation One Election : జమిలి బిల్లును కేంద్రం జాయింట్ పార్లమెంటరీ కమిటీ(JPC)కి పంపనున్న విషయం తెలిసిందే. కమిటీకి అధికార, విపక్షాల నుంచి సభ్యులను ఎంపిక చేస్తారు. INC తరఫున ప్రియాంక గాంధీ, మనీశ్ తివారీకి చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది. TDP నుంచి హరీశ్ బాలయోగి, DMK-విల్సన్, సెల్వ గణపతి, JDU-సంజయ్ ఝా, SP-ధర్మేంద్ర యాదవ్, శివసేన(శిండే)-శ్రీకాంత్ శిండే, TMC నుంచి కళ్యాణ్ బెనర్జీ, సాకేత్ గోఖలేకు అవకాశం దక్కుతుందని సమాచారం. ఈ కమిటీ జమిలి ఎన్నికల రాజ్యాంగ సవరణ బిల్లును పరిశీలించనుంది. ప్రస్తుతం పార్లమెంట్లో బీజేపీ తర్వాత కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా ఉంది. కాంగ్రెస్ ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది.
వయనాడ్ ఎంపి, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఈ బిల్లులు రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. ఇది మన దేశ సమాఖ్య వాదానికి విరుద్ధం. ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. ఇది ఎన్నికల సంస్కరణ కాదని, ఓ జెంటిల్మెన్ కలను, కోరికను నెరవేర్చడమేనని పరోక్షంగా ప్రధాని మోడీపై నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి లేదా పార్లమెంటుకు లోబడి ఉండవని టిఎంసి నేత కల్యాణ్ బెనర్జీ పేర్కొన్నారు. ఈ బిల్లులు రాష్ట్రాల అసెంబ్లీల స్వయంప్రతిపత్తిని తొలగిస్తాయని మండిపడ్డారు.
ఇకపోతే..దేశమంతటా లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించేందుకు అనువుగా 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్, 129వ రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు, కేంద్ర పాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లును కూడా లోక్సభలో ప్రవేశపెట్టారు. దాదాపు 90 నిమిషాల చర్చ తర్వాత, బిల్లుకు అనుకూలంగా 269 మంది, వ్యతిరేకంగా 198 మంది ఓటేశారు. అయితే, కేంద్రం నియంతృత్వంగా వ్యవహరిస్తుందంటూ ప్రతిపక్షాలు మండిపడ్డాయి. వారు జాయింట్ పార్లమెంట్ కమిటీకి బిల్లు పంపాలని డిమాండ్ చేశారు. అందుకే, బిల్లును జేపీసీ కమిటీకి పంపాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.
Read Also: TG TET 2024 Exam : తెలంగాణ టెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల