Modi: గుజరాత్ పోలింగ్ లో క్యూ లైన్ లో నిల్చుని ఓటేసిన ప్రధాని మోదీ
- By Maheswara Rao Nadella Published Date - 12:10 PM, Mon - 5 December 22
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తుది విడత పోలింగ్ సోమవారం ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రధాని మోదీ ఈ ఉదయం గాంధీనగర్ రాజ్భవన్ నుంచి అహ్మదాబాద్ చేరుకున్నారు. రాణిప్లోని నిషాన్ పబ్లిక్ స్కూల్కు వచ్చిన మోదీ కాన్వాయ్ను కొంత దూరంలో ఆపి నడుచుకుంటూ పోలింగ్ కేంద్రం వరకు వెళ్లారు. ప్రధానిని చూసేందుకు వందల మంది అభిమానులు రాగా, దారి పొడవునా వారికి అభివాదం చేశారు. అనంతరం పోలింగ్ కేంద్రం వద్ద సామాన్య ప్రజలతో కలిసి క్యూలైన్లో నిల్చుని ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంతకుముందు.. ఈ ఎన్నికల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రధాని మోదీ ట్విటర్ వేదికగా పిలుపునిచ్చారు.
గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అహ్మదాబాద్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. శైలజ్ అనుపమ్ పాఠశాలలోని పోలింగ్ కేంద్రానికి వచ్చిన సీఎం పటేల్ కూడా క్యూలైన్లో నిల్చుని ఓటేశారు. గుజరాత్ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా దంపతులు అహ్మదాబాద్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా అహ్మదాబాద్లోనే ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఓటు వేసేందుకు ప్రజలు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉదయం 9 గంటల వరకు 4.75శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
రెండో విడతలో భాగంగా 14 జిల్లాల్లోని 93 నియోజకవర్గాలకు నేడు పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 833 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 2.51 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. 5.30 గంటలకు ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడికానున్నాయి. డిసెంబరు 8వ తేదీన గుజరాత్తో సహా హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు.
Related News
Modi : మోడీ ఏపీ టూర్ డేట్స్ ప్రకటించిన బిజెపి..
ప్రధాని మోడీ మరోసారి ఏపీలో పర్యటించబోతున్నారు. ఈ మేరకు బిజెపి అధిష్టానం మోడీ పర్యటనకు సంబదించిన తేదీలను ప్రకటించింది