PM Modi : అమెరికా చేరుకున్న ప్రధాని..ప్రవాస భారతీయుల ఘన స్వాగతం
వాషింగ్టన్ డీసీలో తనకు ప్రత్యేకంగా స్వాగతం పలికినందుకు ప్రవాస భారతీయులకు ప్రధాని మోడీ కృతజ్ఞతలు తెలుపుతూ ఎక్స్లో పోస్ట్ చేశారు.
- Author : Latha Suma
Date : 13-02-2025 - 11:28 IST
Published By : Hashtagu Telugu Desk
PM Modi : భారత ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటనలో భాగంగా అమెరికా కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన యూఎస్ మిలటరీ తో పాటు ప్రభుత్వ వర్గాలు ఘన స్వాగతం పలికారు. గడ్డకట్టే చలిలో కూడా వాషింగ్టన్ డీసీలో ప్రవాస భారతీయులు “వెల్ కం టూ అమెరికా” ప్లకార్డులను చేతబట్టుకుని గ్రాండ్ వెల్కం చెప్పారు. వాషింగ్టన్ డీసీలో తనకు ప్రత్యేకంగా స్వాగతం పలికినందుకు ప్రవాస భారతీయులకు ప్రధాని మోడీ కృతజ్ఞతలు తెలుపుతూ ఎక్స్లో పోస్ట్ చేశారు. అంతే కాకుండా అమెరికాకు చేరుకున్న తర్వాత ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబ్బార్డ్తో భేటీ అయినట్లు తెలిపారు. ఇరుదేశాల మధ్య ఉన్న స్నేహ సంబంధాలపై ఆమెతో చర్చలు జరిపినట్లు ప్రధాని మోడీ పేర్కొన్నారు.
Read Also: Kalvakuntla Kavitha: జగిత్యాల సీటుపై కవిత ఫోకస్.. టార్గెట్ అసెంబ్లీ
అదే విధంగా భారత్, అమెరికా భాగస్వామ్యంలో కొత్త అధ్యయనం మొదలైందని భారత విదేశాంగ శాఖ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాంగ్రెస్ చట్టసభ సభ్యులతో పాటు పలువురు ప్రముఖులతో మోడీ భేటీ కానున్నట్లు వెల్లడించింది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. స్టార్లింక్ సేవలపై ఆయనతో చర్చించే అవకాశం ఉందంటూ పలు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెల్లడిస్తున్నాయి.
కాగా, అంతకు ముందు ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా మార్సెయిల్ లో భారత నూతన కాన్సులేట్ను ప్రధాని మోడీ, అధ్యక్షుడు మేక్రాన్ కలిసి ప్రారంభించారు. మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన భారత సైనికుల త్యాగాలకు గుర్తుగా ఆ దేశ ప్రభుత్వం మార్సెయిల్ ప్రాంతంలో యుద్ధ స్మారక స్థూపాన్ని నిర్మించింది. ప్రధాని మోడీ అక్కడి వెళ్లి అమర వీరులకు నివాళులర్పించారు. కామన్వెల్త్ వార్ గ్రేవ్స్ కమిషన్ యుద్ధ స్మారక స్థూప నిర్వహణ బాధ్యతలను తీసుకుంది.
Read Also : Vallabhaneni Vamsi : కిడ్నాప్ కేసు.. వల్లభనేని వంశీ అరెస్ట్