Petrol and diesel prices: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
- Author : Vamsi Chowdary Korata
Date : 23-05-2026 - 9:50 IST
Published By : Hashtagu Telugu Desk
భారతదేశంలో వాహనదారులకు మరోసారి షాక్ తగిలింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇంధన ధరల్ని పెంచేశాయి. లీటరుకు సుమారు రూపాయి వరకు పెంచగా వాహనదారులపై భారం మరింత పెరిగింది. గత 8 రోజుల వ్యవధిలోనే దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు మూడోసారి పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
సామాన్య, మధ్య తరగతి ప్రజలపై మరోసారి ఇంధన ధరల భారం పడింది. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఇవాళ పెట్రోల్, డీజిల్ ధరలను మళ్లీ పెంచాయి. తాజా పెంపుతో పెట్రోల్పై లీటర్కు 87 పైసలు, డీజిల్పై 91 పైసలు పెరిగాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ. 99.51కి చేరగా, డీజిల్ ధర రూ. 92.49కి చేరుకుంది.
గత 10 రోజుల వ్యవధిలో ఇంధన ధరలను పెంచడం ఇది మూడోసారి కావడం గమనార్హం. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ముడిచమురు ధరల భారాన్ని చమురు కంపెనీలు దశలవారీగా వినియోగదారులకు బదిలీ చేస్తున్నాయి.
ఇందులో భాగంగా మే 15న లీటరుకు ఏకంగా రూ. 3 పెంచగా, మే 19న మరో 90 పైసలు పెంచారు. తాజా పెంపుతో కలిపి ఈ 10 రోజుల వ్యవధిలోనే పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు దాదాపు రూ. 5 మేర పెరిగాయి.
ఇక దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లోనూ ధరలు భారీగా పెరిగాయి. కోల్కతాలో లీటరు పెట్రోల్ ధర రూ. 110.64, డీజిల్ రూ. 97.02గా ఉంది. ముంబైలో పెట్రోల్ రూ. 108.49, డీజిల్ రూ. 95.02కు చేరింది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 105.31, డీజిల్ ధర రూ. 96.98 వద్ద కొనసాగుతోంది.
ఇక, తాజా పెంపుతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 112.81కు చేరగా, లీటర్ డీజిల్ ధర రూ. 100.94కి పెరిగాయి. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 113.53కు, లీటర్ డీజిల్ ధర రూ. 101.27కి చేరాయి. వరుస పెంపులతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.