Opposition Boycott : పార్లమెంట్ ప్రారంభోత్సవం బైకాట్..విపక్షాలు ఏకం
- By Pasha Published Date - 12:48 PM, Wed - 24 May 23

కొత్త పార్లమెంట్ భవనం దేశంలోని విపక్ష పార్టీలను ఏకతాటిపైకి తెచ్చింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కాదని.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈనెల 28న కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభిస్తుండటంపై అవి దండుకట్టాయి. రాజ్యాంగం ఇచ్చిన ప్రోటోకాల్ కు ప్రధాని మోడీ తిలోదకాలు ఇస్తున్నారని ఆరోపిస్తున్న ప్రతిపక్ష పార్టీలు ఈ ప్రారంభోత్సవానికి దూరంగా ఉండాలని (Opposition Boycott) నిర్ణయించాయి. ఈ మేరకు కాంగ్రెస్ సహా 19 పార్టీలు బుధవారం సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి.
also read : New Parliament Photos : కొత్త పార్లమెంట్ అదుర్స్.. ఓ లుక్కేయండి
కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించాల్సి ఉండగా.. ప్రధాని మోడీనే ప్రారంభించాలనుకోవడం ప్రజాస్వామ్యంపై ప్రత్యక్ష దాడికి దిగడం లాంటిదే అని విపక్షాలు అభివర్ణించాయి. ఈ విషయంలో ప్రభుత్వం తీరు ప్రజాస్వామ్యాన్ని బెదిరించేలా ఉందని ఉమ్మడి లేఖలో(Opposition Boycott) వ్యాఖ్యానించాయి. ఈ లేఖలో కాంగ్రెస్, డీఎంకే, ఆప్, శివసేన (యూబీటీ), ఎస్పీ, సీపీఐ, జార్ఖండ్ ముక్తి మోర్చా, కేరళ కాంగ్రెస్ (మణి), విదుతలై చిరుతైగల్ కట్చి, రాష్ట్రీయ లోక్ దళ్, టీఎంసీ, జేడీయూ, ఎన్ సీపీ, సీపీఐ(ఎం), ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, నేషనల్ కాన్ఫరెన్స్, రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ, మరుమలార్చి ద్రవిడ మున్నేత్ర కజగం పార్టీల పేరుతో ప్రకటన వెలువడింది.