వాజ్పేయి జయంతి వేళ ఢిల్లీలో అటల్ క్యాంటీన్లు ప్రారంభం !
- Author : Vamsi Chowdary Korata
Date : 25-12-2025 - 2:49 IST
Published By : Hashtagu Telugu Desk
Atal Canteens : ఢిల్లీలో పేదల కోసం బీజేపీ ప్రభుత్వం అమ్మ, అన్న తరహాలో అటల్ క్యాంటీన్లను తాజాగా ప్రారంభించింది. ఇందులో కేవలం 5 రూపాయలకే రుచికరమైన శాకాహార భోజనం అందజేయనున్నారు. మొదట 45 క్యాంటీన్లు, త్వరలో మరో 55 క్యాంటీన్లు సహా 100 అందుబాటులోకి రానున్నాయి. కూలీలు, అల్పాదాయ వర్గాలకు గౌరవప్రదమైన ఆహారం అందించడమే లక్ష్యంగా ఈ క్యాంటీన్లు పనిచేస్తాయి. ఇక, ఈ క్యాంటీన్లకు ఆద్యురాలు దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత. ఆమె దేశంలోనే తొలిసారి పేదల కోసం క్యాంటీన్లు ప్రారంభించారు.
- ఢిల్లీలో అన్నా క్యాంటీన్ల తరహాలో క్యాంటీన్లు
- అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేళ ప్రారంభం
- రూ.5 లకే పప్పు, కూర, చపాతీ, రైస్, పికిల్
తమిళనాడులో అమ్మ, ఆంధ్రప్రదేశ్ అన్నా, కర్ణాటకలో ఇందిరా, క్యాంటీన్ల తరహాలోనే పేదలకు తక్కువ ధరకే రుచికరమైన భోజనం అందజేయడానికి దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం క్యాంటీన్లను ప్రారంభించింది. మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్పేయి శతజయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా అటల్ క్యాంటీన్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం రూ.5కే శాకాహార భోజనం అందజేయనున్నారు. పప్పు, రైస్, చపాతీ, కర్రీ, పికిల్తో కూడిన మంచి భోజనం చేయాలంటే రెస్టారెంట్, ప్రాంతాన్ని బట్టి రూ.500 నుంచి రూ.2,000 వరకు ఉంటుంది. కానీ, అటల్ క్యాంటీన్లో నామమాత్రపు రుసుముకే ఆహారం లభిస్తుంది. తొలి విడతగా 45 క్యాంటీన్లు ప్రారంభించారు. మిగతా 55 త్వరలోనే ప్రారంభించనున్నట్టు అధికారులు తెలిపారు.
లజ్పత్ నగర్లో క్యాంటీన్ను ప్రారంభించిన ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా.. పేదలు, కూలీలు, అల్పాదాయ వర్గాలకు గౌరవప్రదమైన ఆహారం అందజేయడానికే అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు. ‘అటల్ క్యాంటీన్ ఢిల్లీకి ఆత్మగా మారుతుంది.. ఆకలితో ఎవరూ నిద్రపోకూడని ప్రదేశం’ అని ఆమె అన్నారు. తొలి దశలో 45 క్యాంటీన్లను ఆర్కే పురం, జంగ్పుర, షాలీమార్ బాగ్, గ్రేటర్ కైలాష్, రాజౌరీ గార్డెన్, నరేలా, బవానా సహ అనేక ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి. రాబోయే రోజుల్లో మిగతా 55ను అందుబాటులోకి తీసుకొస్తామని సీఎం రేఖా గుప్తా పేర్కొన్నారు.
నగరం అన్ని విధాలుగా అభివృద్దికి నిరంతరం కష్టించే కార్మికులకు, శ్రమజీవులకు ప్రభుత్వం ఇచ్చే ఓ చిరు కానుకగా సీఎం అభివర్ణించారు. ఎటువంటి అక్రమాలు, అవకతవకలు జరగకుండా పారదర్శకతను పెంచడానికి, మాన్యువల్ కూపన్ల బదులు డిజిటల్ టోకెన్ వ్యవస్థను తీసుకొచ్చినట్టు ఆమె తెలిపారు. అంతేకాదు దశలవారీగా అన్ని క్యాంటీన్లలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు.
ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు లంచ్, సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు డిన్నర్ రోజుకు రెండు పూటలా ఆహారం లభ్యమవుతుంది. ఒక్కో క్యాంటీన్లో సుమారు 500 మందికి ఆహారం అందజేస్తారు. ఢిల్లీ ప్రభుత్వం భోజనం పంపిణీ చేయడానికి మాన్యువల్ కూపన్ల స్థానంలో డిజిటల్ టోకెన్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్మెంట్ బోర్డ్ (DUSIB) డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా సీసీటీవీ కెమెరాలు అన్ని కేంద్రాలను రియల్ టైమ్లో పర్యవేక్షిస్తాయి.
నగరం అన్ని విధాలుగా అభివృద్దికి నిరంతరం కష్టించే కార్మికులకు, శ్రమజీవులకు ప్రభుత్వం ఇచ్చే ఓ చిరు కానుకగా సీఎం అభివర్ణించారు. ఎటువంటి అక్రమాలు, అవకతవకలు జరగకుండా పారదర్శకతను పెంచడానికి, మాన్యువల్ కూపన్ల బదులు డిజిటల్ టోకెన్ వ్యవస్థను తీసుకొచ్చినట్టు ఆమె తెలిపారు. అంతేకాదు దశలవారీగా అన్ని క్యాంటీన్లలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు.