Modi Graph : 9ఏళ్లలో లేచిపడిన మోడీ గ్రాఫ్
Modi up to down )ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గ్రాఫ్ 2018 వరకు పీక్ స్టేజ్ కి వెళ్లింది. దాని ఫలితం 2019 ఎన్నికల్లో కనిపించింది.
- By CS Rao Published Date - 03:01 PM, Fri - 26 May 23
Modi Graph : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గ్రాఫ్ 2018 వరకు పీక్ స్టేజ్ కి వెళ్లింది. దాని ఫలితం 2019 ఎన్నికల్లో కనిపించింది. ఆ తరువాత నుంచి ఆయన గ్రాఫ్ పడిపోతూ వస్తోంది. తొమ్మిదేళ్ల మోడీ హయాంను తీసుకుంటే తొలి ఏడేళ్లు 21 రాష్ట్రాల్లో బీజేపీని (BjP) అధికారంలో నిలబెట్టారు. ఆ తరువాత నాలుగేళ్ల హయాం14 రాష్ట్రాలకు మాత్రమే అధికారాన్ని పరిమితం చేసింది. ప్రధానిగా మోడీ బాధ్యతలు స్వీకరించేనాటికి ఏడు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. ఇప్పుడు 14 రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ 21 నుంచి 14 రాష్ట్రాలకు పడిపోవడాన్ని మోడీ క్రేజ్ తగ్గిందని చెప్పడానికి నిదర్శనంగా ఉంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గ్రాఫ్ (Modi Graph)
2014వ ఏడాది ఇదే రోజున నరేంద్ర మోడీ రాష్ట్రపతిభవన్లో అంగరంగ వైభవంగా ప్రమాణస్వీకారం చేశారు. దేశ విదేశాల నుంచి ఎంపిక చేసిన సుమారు 4 వేల మంది ఈ వేడుకకు హాజరయ్యారు. దేశానికి 15వ ప్రధానమంత్రిగా అప్పట్లో ఉన్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రమాణస్వీకారం చేయించారు. ఆ రోజు నుంచి నరేంద్ర మోడీ తిరుగులేని ప్రధానిగా కొనసాగుతున్నారు. కానీ, గత 4ఏళ్లుగా ఆయన గ్రాఫ్ పడిపోతోన్న విషయాన్ని గమనిస్తే, 2024 ఎన్నికల విజయంపై అనుమానం కలిగిస్తోంది.
సంకీర్ణ ప్రభుత్వాలతో విసిగిపోయిన భారతదేశం ప్రజలు 30ఏళ్ల తరువాత 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మెజార్టీని ఇచ్చారు. ఆ పార్టీ 282 సీట్లు గెలుచుకుంది. 1984 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ 414 సీట్లు గెలుచుకుంది. ఆ తర్వాత, 2019 లోక్సభ ఎన్నికలలో బిజెపి 303 స్థానాలను గెలుచుకుంది. భారత చరిత్రలో ఒకే పార్టీ గెలుచుకున్న అత్యధిక స్థానాల్లో రెండవ రికార్డ్ గా నిలిచింది.
మోదీ తొలిసారి ప్రధాని అయినప్పుడు దేశంలోని ఏడు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఉంది. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గోవాలలో బీజేపీ ముఖ్యమంత్రులు ఉండగా, పంజాబ్లో శిరోమణి అకాలీదళ్, ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో కలిసి 2014లో అధికారాన్ని పంచుకుంది. సౌత్ ఇండియా నుంచి బీజేపీకి అధికారం ఉన్న రాష్ట్రమే లేదు. నార్త్ ఈస్ట్ లో 3 బీజేపీ సీఎంలు ఉన్నారు.
సౌత్ ఇండియా నుంచి బీజేపీకి 0
ఈశాన్య భారతదేశం (సిక్కింతో సహా)లోని 8 రాష్ట్రాల్లో మొత్తం 25 మంది ఎంపీలు వచ్చారు. వీరిలో బీజేపీకి 15 మంది ఎంపీలు అంటే 60% ఉన్నారు. అస్సాంలో హిమంత బిస్వా శర్మ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. నాగాలాండ్లో ఎన్డిపిపి అంటే నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ నాయకత్వంలో బిజెపి అధికారంలో ఉంది. ఎన్డిపిపికి చెందిన నే నీఫియు రియో ముఖ్యమంత్రి. మణిపూర్లో స్థానిక పార్టీలైన ఎన్పిపి, ఎన్పిఎఫ్, కెపిఎలతో కలిసి బిజెపి అధికారంలో ఉంది. బీజేపీకి చెందిన బీరేన్ సింగ్ సీఎం.
మిజోరామ్ను మిజో నేషనల్ ఫ్రంట్ పాలిస్తోంది మరియు జోరంతంగా అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. త్రిపురలో బీజేపీ అధికారంలో ఉంది. ఇక్కడ మాణిక్ సాహా ముఖ్యమంత్రి. అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ అధికారంలో ఉంది. ఇక్కడ పెమా ఖండూ ముఖ్యమంత్రి. సిక్కింలో సిక్కిం క్రాంతికారి మోర్చా అధికారంలో ఉంది. ప్రేమ్ సింగ్ తమాంగ్ సీఎం. రాష్ట్రంలో బీజేపీకి ఎమ్మెల్యేలు లేరు, కానీ SKMలో బీజేపీ నేతృత్వంలోని NDAలో భాగమే.
వెస్ట్ ఇండియా (మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్)లో మహారాష్ట్రలో షిండే నేతృత్వంలోని శివసేనతో బీజేపీ ప్రభుత్వం ఉంది. గుజరాత్లో బీజేపీకి, రాజస్థాన్లో కాంగ్రెస్కు పూర్తి మెజారిటీ ప్రభుత్వం ఉంది. ఈ మూడు రాష్ట్రాల్లోని మొత్తం 99 మంది ఎంపీలలో 73 మంది బిజెపికి చెందినవారు, అంటే 72%.
తూర్పు భారతదేశం (బీహార్, బెంగాల్, జార్ఖండ్, ఒడిశా)లో బీహార్లో మహాకూటమి ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం, జార్ఖండ్లో JMM ప్రభుత్వం, ఒడిశాలో BJD ప్రభుత్వం ఉన్నాయి. అంటే తూర్పు భారతదేశంలో ఎక్కడా బీజేపీ ప్రభుత్వం లేదు. మొత్తం 117 మంది ఎంపీలలో 54 మంది బిజెపికి చెందిన వారు, అంటే 46%. ఉత్తర భారతం (ఢిల్లీ, పంజాబ్, హర్యానా, హిమాచల్, యూపీ, ఉత్తరాఖండ్)లోని హర్యానా, యూపీ, ఉత్తరాఖండ్లు బీజేపీ పాలనలో ఉన్నాయి. ఉత్తర భారతదేశం నుండి మొత్తం 189 ఎంపీల్లో బీజేపీకి 98 ఎంపీలు అంటే 52% ఉన్నారు.
మధ్యభారత్ (ఎంపీ, ఛత్తీస్గఢ్)లోని మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాయి. ఇక్కడ మొత్తం 40 మంది ఎంపీల్లో 37 మంది బీజేపీకి చెందిన వారు అంటే 92%. దక్షిణ భారతంలోని కర్ణాటకలో ఓటమి తర్వాత ఐదు దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం లేదు. దక్షిణ భారతదేశంలోని 5 రాష్ట్రాలు మరియు ఒక కేంద్రపాలిత ప్రాంతం నుండి మొత్తం 130 మంది లోక్సభ ఎంపీలు వచ్చారు. వీరిలో బీజేపీకి 29 మంది ఎంపీలు అంటే 22% మాత్రమే ఉన్నారు. వీరిలో కర్ణాటక నుంచి 25 మంది ఎంపీలు, తెలంగాణ నుంచి నలుగురు ఎంపీలు ఉన్నారు.
5 రాష్ట్రాల్లో బీజేపీకి సవాల్ (Modi up to down)
గత లోక్సభ ఎన్నికల్లో 303 సీట్లు గెలుచుకున్న బీజేపీ 14 రాష్ట్రాల్లో అత్యధిక స్థానాలు గెలుచుకునే స్థితికి చేరుకుంది.
ఈ రాష్ట్రాల్లో, గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్, త్రిపుర మరియు హర్యానాలోని అన్ని స్థానాలను బిజెపి కలిగి ఉంది. కర్ణాటకలో 28కి 25, మధ్యప్రదేశ్లో 29కి 28, బీహార్లో 40కి 39, మహారాష్ట్రలో 48కి 41 సీట్లు గెలుచుకుంది. యూపీలోని 80 సీట్లకు గాను బీజేపీకి 64, జార్ఖండ్లోని 14లో 12, ఛత్తీస్గఢ్లో 11కి 9 సీట్లు కైవసం చేసుకుంది. అంటే ఈ రాష్ట్రాల్లో పార్టీ గరిష్ట పనితీరు కనబరిచింది. ఇప్పుడు ఆయా రాష్ట్రాల్లో బీజేపీ బలహీనపడగా దాన్ని బెంగాల్, బీహార్, తెలంగాణ, కర్ణాటక మరియు ఒడిశాలో భర్తీ చేయాలని భావించింది. ఈ 5 రాష్ట్రాల్లో బీజేపీకి పెను సవాలే ఉంది. గత వైభవం మసకబారుతోంది.
Related News
PM Modi Nomination: మే 14న వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసి లోక్సభ స్థానం నుంచి మే 14న నామినేషన్ దాఖలు చేయనున్నారు.