Maoist Letter : కేంద్రంపై పోరాడాలని ప్రజలకు మావోయిస్టు పార్టీ పిలుపు
Maoist Letter : మావోయిస్టు పార్టీపై వరుస ఎదురుదెబ్బలు పడుతున్నాయి. గత కొన్ని నెలలుగా కీలక నేతలు ఒక్కొక్కరుగా లొంగిపోవడం గమనార్హం
- Author : Sudheer
Date : 03-11-2025 - 1:26 IST
Published By : Hashtagu Telugu Desk
ఇటీవల మావోయిస్టు పార్టీపై వరుస ఎదురుదెబ్బలు పడుతున్నాయి. గత కొన్ని నెలలుగా కీలక నేతలు ఒక్కొక్కరుగా లొంగిపోవడం గమనార్హం. మహారాష్ట్రలో మావోయిస్టు నేతలు మల్లోజుల, ఆశన్న లొంగిపోవడం తర్వాత, తెలంగాణ డీజీపీ శవధర్ రెడ్డి సమక్షంలో బండి ప్రకాశ్ కూడా ఆయుధాలు వదిలారు. తాజాగా ఛత్తీస్గఢ్లో మావోయిస్టు నాయకురాలు సునీతక్క కూడా పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ పరిణామాలు మావోయిస్టు పార్టీలో పెరుగుతున్న అసంతృప్తి, భిన్నాభిప్రాయాలను ప్రతిబింబిస్తున్నాయి. పార్టీ అంతర్గతంగా చర్చల మార్గాన్ని అనుసరించాలా, లేక పాత తాత్విక దారిలోనే కొనసాగాలా అన్నదానిపై విభేదాలు తలెత్తాయి. దీనివల్లే లొంగుబాట్ల సంఖ్య వేగంగా పెరుగుతోందని భద్రతా వర్గాలు భావిస్తున్నాయి.
Laura Wolvaardt : సఫారీ కెప్టెన్ లారా వోల్వార్డ్ ఎమోషనల్.!
ఇదిలా ఉండగా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మావోయిస్టుల కాల్పుల విరమణ ప్రతిపాదనను తిరస్కరించడం తర్వాత, పార్టీ భవిష్యత్ వ్యూహం పట్ల స్పష్టత రాకుండా ఉంది. ఈ పరిస్థితుల్లో మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరిట ఓ లేఖ విడుదల చేశారు. ఆ లేఖలో ఆయన, ఈ ఏడాది మే నెలలో ప్రకటించిన ఆరు నెలల కాల్పుల విరమణ కాలం ముగియడంతో, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరో ఆరు నెలల పాటు కాల్పుల విరమణను కొనసాగించనున్నట్లు ప్రకటించారు. తెలంగాణలో శాంతియుత వాతావరణం కొనసాగాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని, అందుకే పార్టీ కూడా అదే దిశగా నడవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. గత ఆరు నెలల కాలంలో మావోయిస్టు కార్యకలాపాలు తగ్గడం, ప్రజా సమస్యలపై చర్చల వాతావరణం ఏర్పడడం కూడా ఈ ప్రకటనకు ప్రేరణగా నిలిచాయి.
Chevella Bus Accident : రోడ్లు బాగుండకపోవడం వల్లే ఈ ప్రమాదాలు..ఎమ్మెల్యే ను త తరిమేసిన జనం
అయితే, ఈ లేఖలో కేంద్ర ప్రభుత్వంపై జగన్ చేసిన ఆరోపణలు రాజకీయ రీతిలో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న శాంతియుత వాతావరణాన్ని భంగం చేసేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. అలాంటి ప్రయత్నాలను ఎదుర్కోవడానికి అన్ని రాజకీయ పార్టీలు, సామాజిక వర్గాలు, విద్యార్థులు, మేధావులు, ప్రజాసంఘాలు ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇది మావోయిస్టు పార్టీ తరఫున తెలంగాణ ప్రజలకు ఇచ్చిన రాజకీయ సందేశంగా కూడా పరిగణించబడుతోంది. ఇకపోతే, ఇటీవల లొంగిపోయిన నేతలను ‘విప్లవ ద్రోహులు’గా పేర్కొంటూ పార్టీ నుండి బహిష్కరించడం, మరోవైపు శాంతి చర్చలకు ఆసక్తి చూపడం — ఈ రెండు వైపుల ధోరణులు పార్టీ భవిష్యత్తు మార్గం ఏదో అనే ప్రశ్నను మరింత క్లిష్టం చేస్తున్నాయి.