BJP : ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారానికి పలువురు సినీ సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు !
50 మంది సినీతారలు, ప్రముఖ పారిశ్రామికవేత్తలతో పాటు ఇతర దేశాల దౌత్యవేత్తలు, 20 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు, కేంద్రమంత్రులు, బీజేపీ అగ్రనేతలు ఈ మెగా ఈవెంట్కు రానున్నారట.
- By Latha Suma Published Date - 10:43 AM, Tue - 18 February 25

BJP : ఇంకా ఢిల్లీ సీఎం ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఢిల్లీ తదుపరి సీఎం ఎవరన్నది బీజేపీ ఇంకా ప్రకటించలేదు. అయితే, గురువారం ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఇన్నేళ్ల తర్వాత బీజేపీ అధికారంలోకి వస్తుండటంతో నూతన ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున సినీ తారలు, పారిశ్రామికవేత్తలను ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
Read Also: High Court : తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
50 మంది సినీతారలు, ప్రముఖ పారిశ్రామికవేత్తలతో పాటు ఇతర దేశాల దౌత్యవేత్తలు, 20 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు, కేంద్రమంత్రులు, బీజేపీ అగ్రనేతలు ఈ మెగా ఈవెంట్కు రానున్నారట. వీరితోపాటు ఢిల్లీకి చెందిన పలువురు రైతులు, కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను కూడా ఆహ్వానించినట్లు సమాచారం. బాబా రాందేవ్, స్వామి చిదానంద, బాబా బాగేశ్వర్ ధీరేంద్రశాస్త్రి వంటి ఆధ్యాత్మిక గురువులు ప్రత్యేక అతిథులుగా హాజరుకానున్నట్లు బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి.
ఇక, ఫిబ్రవరి 20న (గురువారం) సాయంత్రం 4.30 గంటలకు కొత్త సీఎం ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారైనట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ప్రఖ్యాత రామ్లీలా మైదాన్లో జరిగే ఈ వేడుకకు కమలదళం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రమాణస్వీకారానికి ముందు ప్రముఖ కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనుంది. ఈనెల 8న వెలువడిన శాసనసభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, ఎన్నికల ఫలితాలు వెలువడి 10 రోజులు అవుతున్నా నూతన ముఖ్యమంత్రి ఎవరనేది ఇంకా తెలియరాలేదు. మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేశ్వర్మ పేరు సీఎం రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది.