West Bengal Result 2026 : మమతా బెనర్జీ కీలక ప్రకటన
ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం బీజేపీ మెజారిటీ మార్కు దిశగా దూసుకుపోతుండగా, మమతా బెనర్జీ మాత్రం తన పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని సంకేతాలిచ్చారు. కౌంటింగ్ ప్రక్రియలో పారదర్శకత లేదని, రీ-కౌంటింగ్ లేదా న్యాయపోరాటం చేసే దిశగా కూడా ఆలోచిస్తున్నట్లు
- Author : Sudheer
Date : 04-05-2026 - 1:43 IST
Published By : Hashtagu Telugu Desk
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళి ఉత్కంఠభరితంగా సాగుతున్న వేళ, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ ఆమె చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల్లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) మరియు బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగుతున్న తరుణంలో మమతా బెనర్జీ తన పార్టీ కార్యకర్తలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఫలితాలు పూర్తిగా వెలువడే వరకు ఎవరూ కౌంటింగ్ కేంద్రాల నుంచి బయటకు రావొద్దని ఆమె స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసి, అధికారికంగా సర్టిఫికెట్లు చేతికి అందే వరకు అప్రమత్తంగా ఉండాలని, పోలింగ్ కేంద్రాల వద్దే పహారా కాయాలని ఆమె పిలుపునిచ్చారు.
ఎన్నికల కమిషన్పై ‘దీదీ’ ధ్వజమెత్తు
ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ (EC) తీరుపై మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కమిషన్ కావాలనే కౌంటింగ్ ప్రక్రియను నెమ్మదిగా చేస్తోందని ఆమె ఆరోపించారు. ముఖ్యంగా టీఎంసీ అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యంలో ఉన్న నియోజకవర్గాల్లో ఫలితాలను ప్రకటించకుండా జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. కొన్ని చోట్ల కౌంటింగ్ ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా నిలిపివేసిందని, ఇది ప్రజాస్వామ్య విరుద్ధమని ఆమె ధ్వజమెత్తారు. బీజేపీకి ప్రయోజనం చేకూర్చేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు.
బెంగాల్ పోరులో ఉత్కంఠ.. న్యాయపోరాటానికి సిద్ధం?
ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం బీజేపీ మెజారిటీ మార్కు దిశగా దూసుకుపోతుండగా, మమతా బెనర్జీ మాత్రం తన పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని సంకేతాలిచ్చారు. కౌంటింగ్ ప్రక్రియలో పారదర్శకత లేదని, రీ-కౌంటింగ్ లేదా న్యాయపోరాటం చేసే దిశగా కూడా ఆలోచిస్తున్నట్లు తృణమూల్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. బెంగాల్ కోటను కాపాడుకునేందుకు మమత తన వ్యూహాలకు పదును పెడుతుండటంతో, తుది ఫలితం వెలువడే వరకు అక్కడ హైడ్రామా కొనసాగేలా కనిపిస్తోంది.