Supreme Court : ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం..తాము జోక్యం చేసుకోలేం: సుప్రీంకోర్టు
Israel-Hamas war: ఇజ్రాయెల్కు భారత్ ఆయుధాలు, మిలిటరీ పరికరాల ఎగుమతిని నిలిపివేయాలని కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ కోర్టులో వ్యాజ్యం దాఖలైంది. దేశవిదేశాంగ విధానపరమైన నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోలేమని వెల్లడించింది.
- By Latha Suma Published Date - 05:31 PM, Mon - 9 September 24

Israel-Hamas war: నేడు సుప్రీంకోర్టు(Supreme Court)లో ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతోన్న యుద్ధానికి సంబంధించిన అంశంపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా ధర్మసనం ఈ పిటిషన్ను కొట్టివేసింది. ఇజ్రాయెల్కు భారత్ ఆయుధాలు, మిలిటరీ పరికరాల ఎగుమతిని నిలిపివేయాలని కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ కోర్టులో వ్యాజ్యం దాఖలైంది. దేశవిదేశాంగ విధానపరమైన నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోలేమని వెల్లడించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది.
ఇలాంటి విషయాలు విదేశాంగ విధానంపై ప్రభావం చూపుతాయి..
ఈ విధంగా ఆదేశిస్తే.. ఆయుధాల ఎగుమతిలో భాగమైన సంస్థలు ఒప్పందాల ఉల్లంఘించాయంటూ దావాలను ఎదుర్కొనే ప్రమాదం ఉంటుందని, అందుకే ఆ సంస్థలను నిలువరించలేమని కోర్టు పేర్కొంది. ఇలాంటి విషయాలు విదేశాంగ విధానంపై ప్రభావం చూపుతాయని వ్యాఖ్యానించింది. అశోక్ కుమార్ శర్మ, మరికొందరు వ్యక్తుల తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఈ పిల్ వేశారు. ఇజ్రాయెల్కు ఆయుధాలు సరఫరా చేసే భారతీయ సంస్థల లైసెన్సు రద్దు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని అందులో పేర్కొన్నారు.
చర్చలు ఫలప్రదం కావడానికి తగిన ప్రయత్నాలు..
గత ఏడాది అక్టోబర్ 7న హమాస్ దాడి చేయడంతో ప్రతీకారంగా ఇజ్రాయెల్ మొదలుపెట్టిన పోరు అంతర్జాతీయంగా తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. గాజాలో రెండు వర్గాల మధ్య జరుగుతోన్న ఈ యుద్ధంలో 40వేల మందికిపైగా పాలస్తీనా వాసులు ప్రాణాలు కోల్పోయారని స్థానిక ఆరోగ్య విభాగం వెల్లడించింది. హమాస్ దాడిని ఖండించిన భారత్.. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని రెండు వర్గాలకు సూచిస్తోంది. అలాగే కాల్పుల విరమణ ఒప్పందం ఆలస్యమవుతుండటం, ఇటీవల ఆరుగురు బందీలు మృతి చెందడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. చర్చలు ఫలప్రదం కావడానికి తగిన ప్రయత్నాలను నెతన్యాహు చేయడం లేదన్న కోణంలో అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.