Indias Longest Bridge : పదుల సంఖ్యలో కూలీల మృతి.. కుప్పకూలిన దేశంలోనే పొడవైన వంతెన!
Indias Longest Bridge : దేశంలోనే అతి పొడవైన రోడ్డు వంతెనను బిహార్లోని సుపాల్లో నిర్మిస్తున్నారు.
- Author : Pasha
Date : 22-03-2024 - 11:07 IST
Published By : Hashtagu Telugu Desk
Indias Longest Bridge : దేశంలోనే అతి పొడవైన రోడ్డు వంతెనను బిహార్లోని సుపాల్లో నిర్మిస్తున్నారు. 10.2 కి.మీ మేర పొడవు కలిగి ఉండే ఈ వంతెన నిర్మాణ పనులు జరుగుతుండగా శుక్రవారం ఉదయం పెను ప్రమాదం చోటుచేసుకుంది. బ్రిడ్జి 50, 51, 52 పిల్లర్ల గార్టర్లు ఒక్కసారిగా కూలి నేలపై పడ్డాయి. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, దాదాపు 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని వెంటనే బైక్లపై ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో వంతెన గార్టర్ల కింద నలిగి పదుల సంఖ్యలో కూలీలు చనిపోయారని స్థానికులు చెబుతున్నారు. ఇవాళ ఉదయం 7 గంటల సమయంలో ఈ ప్రమాద ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
We’re now on WhatsApp. Click to Join
దీనిపై సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అయితే మృతులు, గాయపడ్డ వారి వివరాలను ఇంకా ప్రకటించలేదు. భారత్ మాల ప్రాజెక్టులో భాగంగా సుపాల్లోని బకౌర్, మధుబనిలోని భేజా ఘాట్ మధ్య భారతదేశంలో అతి పొడవైన రహదారి వంతెనను నిర్మిస్తున్నారు. ఇది అసోంలోని భూపేన్ హజారికా వంతెన కంటే కిలోమీటర్ ఎక్కువ పొడవును కలిగి ఉంటుంది. మొత్తం 171 పిల్లర్లతో నిర్మిస్తున్న ఈ బ్రిడ్జిలో ఇప్పటికే 150 పిల్లర్లను నిర్మించారు. పూర్తైన పిల్లర్లపై గర్డర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో 50, 51, 52 పిల్లర్లపై ఏర్పాటు చేసిన గర్డర్లు కూలిపోయాయి.కేంద్ర రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ రూ.1199 కోట్లతో ఈ వంతెనను(Indias Largest Bridge) నిర్మిస్తోంది. దీని నిర్మాణ పనులను గామన్ ఇంజనీర్స్, కాంట్రాక్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ట్రాన్స్ రైల్ లైటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (జాయింట్ వెంచర్) నిర్వహిస్తున్నాయి.
Also Read :Pushpak Viman : ‘పుష్పక విమానం’ ప్రయోగం సక్సెస్.. వీడియో ఇదిగో
‘‘ ఈ బ్రిడ్జి నాణ్యత బాగా లేదని మేం మొదటి నుంచే ఫిర్యాదు చేస్తున్నాం. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ ప్రమాదంలో దాదాపు 40 మంది కూలీలు చనిపోయి ఉంటారు. కానీ కంపెనీకి సంబంధించిన ఒక్క వ్యక్తి కూడా ఇక్కడికి రాలేదు. మేం 15-20 మందిని బైక్లో ఆసుపత్రికి తీసుకెళ్లాము’’ అని ఓ స్థానికుడు మీడియాకు తెలిపాడు.