India Vs Pak : పాకిస్తానీల వీసాలన్నీ రద్దు.. భారత్ సంచలన నిర్ణయం
మెడికల్ వీసాపై పాకిస్తాన్(India Vs Pak) నుంచి వచ్చిన వారు ఏప్రిల్ 29లోగా భారత్ను వీడాలని ఆదేశించింది.
- By Pasha Published Date - 05:04 PM, Thu - 24 April 25

India Vs Pak : కశ్మీరులోని పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ పౌరుల అన్ని వీసాలను భారత్ రద్దు చేసింది. పాకిస్తానీలు వెంటనే భారత్ వీడి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే మెడికల్ వీసాపై పాకిస్తాన్(India Vs Pak) నుంచి వచ్చిన వారు ఏప్రిల్ 29లోగా భారత్ను వీడాలని ఆదేశించింది. పాకిస్తానీయులకు భారత్ జారీ చేసిన వీసాలు ఏప్రిల్ 27 నుంచి చెల్లవని తేల్చి చెప్పింది. మెడికల్ వీసాలు ఏప్రిల్ 29 వరకు చెల్లుబాటు అవుతాయని పేర్కొంది. కొత్తగా అమల్లోకి తెచ్చిన వీసా గడువు ముగిసేలోగా భారత్ వీడి వెళ్లాలని పాకిస్తానీయులకు భారత సర్కారు అల్టిమేటం ఇచ్చింది.ఈమేరకు భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. పాకిస్తాన్కు వెళ్లొద్దని భారతీయులను కోరింది. ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న భారతీయులంతా వీలైనంత త్వరగా స్వదేశానికి వచ్చేయాలని పిలుపునిచ్చింది.
Also Read :Miss World 2025: హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు.. పాకిస్తానీ భామలకు షాక్
ఉగ్రవాదులను వెంటాడి మరీ శిక్షిస్తాం : ప్రధాని మోడీ
కశ్మీరులో జరిగిన ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందంటూ భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇవాళ ఫైర్ అయ్యారు. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ఎక్కడికి పారిపోయినా వెంటాడి మరీ అంతం చేస్తామని ఆయన ప్రకటించారు. ‘‘ఈరోజు బిహార్ నేల నుంచి నేను మొత్తం ప్రపంచానికి చెబుతున్నాను. భారతదేశం ప్రతి ఉగ్రవాదిని, వారికి మద్దతు ఇచ్చేవారిని గుర్తించి, ట్రాక్ చేసి శిక్షిస్తుంది. మేం వారిని భూమి చివరల వరకు వెంబడిస్తాం. ఉగ్రవాదం భారతదేశ స్ఫూర్తిని ఎప్పటికీ విచ్ఛిన్నం చేయలేదు. ఉగ్రవాదులను శిక్షించి తీరుతాం’’ అని ప్రధాని మోడీ వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు పాకిస్తాన్ కూడా భారత్పై ప్రతీకార చర్యలకు దిగింది. భారత విమాన సర్వీసుల కోసం పాకిస్తాన్ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది.