Udayanidhi Stalin : సనాతన ధర్మం వ్యాఖ్యల పై క్షమాపణలు చెప్పను : ఉదయనిధి స్టాలిన్
Udayanidhi Stalin : పెరియార్, మాజీ ముఖ్యమంత్రి సిఎన్ అన్నాదురై, ఎం కరుణానిధి వంటి ద్రావిడ నాయకుల అభిప్రాయాలతో తాను కూడా ఏకీభవిస్తున్నానని అన్నారు. “మహిళలు చదువుకోవడానికి అనుమతించలేదు.
- Author : Latha Suma
Date : 22-10-2024 - 3:02 IST
Published By : Hashtagu Telugu Desk
Sanatana Dharma : తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ గతంలో సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ వ్యాఖ్యలపై మరోసారి ఆయన స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. గతేడాది సెప్టెంబర్లో చేసిన తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు. ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పెరియార్, మాజీ ముఖ్యమంత్రి సిఎన్ అన్నాదురై, ఎం కరుణానిధి వంటి ద్రావిడ నాయకుల అభిప్రాయాలతో తాను కూడా ఏకీభవిస్తున్నానని అన్నారు. “మహిళలు చదువుకోవడానికి అనుమతించలేదు. వారు తమ ఇళ్లను వదిలి వెళ్ళలేకపోయారు, భర్త చనిపోతే వారు కూడా చనిపోవాలి. వీటన్నింటికీ వ్యతిరేకిస్తూ తంతై పెరియార్, అన్నా, కలైంజ్ఞర్ చెప్పిన దానినే నేను చెప్పాను” అని ఉదయనిధి పేర్కొన్నారు.
సెప్టెంబరు 2023లో, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ కుమారుడు ఉదయనిధి, సనాతన ధర్మాన్ని “డెంగ్యూ” మరియు “మలేరియా” లతో పోల్చి , దానిని వ్యతిరేకించడమే కాదు, “నిర్మూలన” చేయమని చెప్పడంతో పెద్ద దుమారం చెలరేగింది. ‘సనాతన నిర్మూలన సదస్సు’లో సనాతన ధర్మం సామాజిక న్యాయం, సమానత్వానికి విరుద్ధమని వాదించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. హిందూ సంస్థల నుండి, అతనిపై అనేక చట్టపరమైన కేసులు నమోదయ్యాయి. నా మాటలను వక్రీకరించారు. తమిళనాడులోనే కాదు, భారతదేశంలోని అనేక కోర్టులలో నాపై కేసులు వేశారు. వారు నన్ను క్షమాపణ చెప్పాలని కోరారు, కానీ చెప్పినదానికి నేను కట్టుబడి ఉన్నాను. నేను కలైంజర్ మనవడిని, నేను క్షమాపణ చెప్పను. నా పై వచ్చిన అన్ని కేసులను ఎదుర్కొంటానని అన్నారు.
రాష్ట్రంలో హిందీని విధించే ప్రయత్నం జరుగుతోందని , తమిళనాడు గీతంలో ఇటీవలి మార్పులు ఈ ప్రయత్నాలకు నిదర్శనమని ఆయన ఆరోపించారు. ఇటీవల దూరదర్శన్ తమిళ కార్యక్రమంలో రాష్ట్ర గీతం నుండి ఉద్దేశపూర్వకంగా కొన్ని పదాలను తొలగించారని, ఇది వివాదానికి దారితీసిందని ఆయన ఎత్తి చూపారు. నూతన వధూవరులు తమ బిడ్డకు అందమైన తమిళ పేరు పెట్టవలసిందిగా నేను కోరుతున్నాను. ఎందుకంటే తమిళనాడులో హిందీని విధించేందుకు చాలామంది ప్రయత్నిస్తున్నారు. నేరుగా చేయలేక తమిళ థాయ్ వాజ్తు ( రాష్ట్ర గీతం) కొత్త విద్యా విధానం ద్వారా హిందీని రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారు” అని ఉప ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్ర క్రీడల మంత్రిగా ఉన్న 46 ఏళ్ల డిఎంకె నాయకుడు ఉదయనిధిని సెప్టెంబర్ 30న ఉప ముఖ్యమంత్రిగా నియమించారు.