Lok Sabha Speaker : స్పీకర్జీ.. ఈసారి ఎంపీల సస్పెన్షన్ పర్వం జరగొద్దు : అఖిలేష్
లోక్సభ స్పీకర్గా ఎన్నికైన ఓం బిర్లాకు అభినందనలు తెలుపుతూ సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
- Author : Pasha
Date : 26-06-2024 - 2:22 IST
Published By : Hashtagu Telugu Desk
Lok Sabha Speaker : లోక్సభ స్పీకర్గా ఎన్నికైన ఓం బిర్లాకు అభినందనలు తెలుపుతూ సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తొలుత స్పీకర్ పదవి ఔన్నత్యం గురించి కొనియాడిన అఖిలేష్.. ఆ తర్వాత 17వ లోక్సభలో విపక్షాలకు ఎదురైన చేదు అనుభవాలను గుర్తు చేశారు. కనీసం 18వ లోక్సభలోనైనా ఎంపీల సస్పెన్షన్ పర్వం కొనసాగదని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ‘‘ప్రజాస్వామ్య పరిరక్షణలో అత్యంత కీలకమైనది స్పీకర్ స్థానం.. ఆ కుర్చీలో కూర్చున్న మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. ప్రతిపక్షాలను ఎలా చూస్తారో.. అధికార పక్షాన్ని కూడా అలాగే చూడాలి. నిష్పక్షపాతంగా మీరు వ్యవహరిస్తే సభలో ఉన్నవారందరికీ ఎలాంటి అన్యాయం జరగదు’’ అని అఖిలేష్(Lok Sabha Speaker) వ్యాఖ్యానించారు.
We’re now on WhatsApp. Click to Join
‘‘మీరు ప్రతిపక్షాల పట్ల నిష్పక్షపాతంగా వ్యవహరించండి. అధికార పార్టీతో సహా విపక్ష సభ్యులకు కూడా సమాన అవకాశాలు ఇవ్వండి. మా గొంతు నొక్కకండి. నిష్పక్షపాత వైఖరే ఈ గొప్ప పదవికి పెద్ద బాధ్యత. ఏ ప్రజాప్రతినిధుల గొంతు నొక్కకూడదు. సస్పెన్షన్ లాంటి చర్య మళ్లీ జరగబోదని భావిస్తున్నాను’’ అని అఖిలేష్ పేర్కొన్నారు. ‘‘స్పీకర్ నియంత్రణ ప్రతిపక్షంపైనే ఉందని.. అధికారపక్షంపై కూడా కొంతమేర ఉండాలి. మీ సంకేతాలపైనే సభ నడవాలి. ఇతర మార్గాల్లో సభ నడవకూడదు’’ అని ఆయన చెప్పారు. పాలక వ్యవస్థను గౌరవించినట్లే ప్రతిపక్షాలను కూడా గౌరవిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.