Himachal Pradesh : హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు.. నేడు 68 మంది అభ్యర్థులను ప్రకటించనున్న కాంగ్రెస్
నవంబర్ 12న జరగనున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మొత్తం 68 మంది అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ నేడు...
- Author : Prasad
Date : 17-10-2022 - 6:25 IST
Published By : Hashtagu Telugu Desk
నవంబర్ 12న జరగనున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మొత్తం 68 మంది అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ నేడు (సోమవారం) ప్రకటించనుంది. 57 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ఆదివారం విడుదల చేస్తామని, మిగిలిన 11 మంది అభ్యర్థులను తర్వాత ప్రకటిస్తామని కాంగ్రెస్ నాయకురాలు అల్కా లాంబా గతంలో ప్రకటించారు. అయితే మొత్తం 68 మంది అభ్యర్థులను సోమవారం ప్రకటిస్తామని లాంబా ఆదివారం సాయంత్రం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. హిమాచల్ ప్రదేశ్లోని 68 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 12న పోలింగ్ జరగనుండగా, డిసెంబర్ 8న కౌంటింగ్ జరగనుంది. ప్రస్తుతం అసెంబ్లీలో బీజేపీకి 43 మంది, కాంగ్రెస్కు 22 మంది, ఇద్దరు స్వతంత్రులు, ఒక సీపీఎం ఎమ్మెల్యే ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పోటీ ఈ సారి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రత్యక్ష పోటీ జరిగే అవకాశం ఉంది. వచ్చే రెండు మూడు రోజుల్లో హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు తమ పార్టీ అభ్యర్థులందరినీ ప్రకటిస్తుందని ఆప్ రాష్ట్ర ఇన్ఛార్జ్ హర్జోత్ సింగ్ బైన్స్ ఆదివారం తెలిపారు. హిమాచల్ ప్రదేశ్లో 55,07,261 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 27,80,208 మంది పురుషులు, 27,27,016 మంది మహిళలు ఉన్నారు.