Rajnath Singh : ఉగ్రవాదులతో పోరాడండి.. భారతీయులను బాధపెట్టొద్దు.. ఆర్మీకి రక్షణమంత్రి సూచన
Rajnath Singh : ప్రతి సైనికుడు తమకు కుటుంబ సభ్యుడి లాంటివాడని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు.
- By Pasha Published Date - 02:17 PM, Wed - 27 December 23

Rajnath Singh : ప్రతి సైనికుడు తమకు కుటుంబ సభ్యుడి లాంటివాడని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ప్రతి భారతీయుడు కూడా ఇలాగే భావిస్తాడని ఆయన చెప్పారు. బుధవారం రోజు జమ్మూ పర్యటనకు వచ్చిన రాజ్నాథ్.. అక్కడ భద్రతా పరిస్థితులపై ఆర్మీ, పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రత్యేకించి ఇటీవల రెండు ఆర్మీ ట్రక్కులపై జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు భారత సైనికులు అమరులైన అంశంపై వివరాలన్నీ తెలుసుకున్నారు. ‘‘భారత సైనికులను ఎవరైనా చెడు దృష్టితో చూసినా మేం సహించం. భారత భద్రతా బలగాలపై దాడులకు శత్రుమూకలు చేసే కుట్రలను నిఘా వర్గాల అండతో భగ్నం చేసి తీరుతాం. సరిహద్దుల్లో నిఘాను పెంచడానికి అవసరమైన మద్దతును ప్రభుత్వం తరఫున అందిస్తాం. ఈవిషయంలో ఎంత ఖర్చుకైనా వెనుకాడేది లేదు’’ అని రాజ్నాథ్ (Rajnath Singh) స్పష్టం చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
భారత భద్రతా బలగాలపై జరిగే ప్రతి దాడిని కూడా తీవ్రంగానే పరిగణిస్తామని భారత రక్షణ మంత్రి తెలిపారు. ‘‘మీరు దేశ రక్షకులు. దేశ భద్రతతో పాటు దేశ ప్రజల హృదయాలను గెలుచుకునే బాధ్యత కూడా మీపై ఉంది. మీకు నా రిక్వెస్టు ఏమిటంటే.. ఉగ్రవాదులతో పోరాడండి.. కానీ భారతీయులను బాధపెట్టే పొరపాట్లు చేయకండి” అని భారత సైన్యానికి రాజ్నాథ్ సూచించారు. ‘‘మీరందరూ అప్రమత్తంగా ఉన్నారని నాకు తెలుసు. కానీ మరింత అప్రమత్తత అవసరం అని నేను భావిస్తున్నాను. మీ ధైర్యసాహసాలు మమ్మల్ని గర్వించేలా చేస్తాయి. మీ త్యాగం, కృషి వెలకట్టలేనివి. ఒక సైనికుడు అమరుడైనప్పుడు మేమిచ్చే పరిహారం.. జరిగిన నష్టాన్ని పూడ్చలేదని మాకు తెలుసు’’ అని రాజ్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రభుత్వం మీ వెంటే ఉంది. మీ సంక్షేమం, భద్రతకే మేం ప్రాధాన్యత ఇస్తాం’’ అని స్పష్టం చేశారు. జమ్మూలో సమీక్షా సమావేశం ముగిసిన అనంతరం రాజ్నాథ్.. అక్కడి నుంచి రాజౌరికి బయలుదేరి వెళ్లారు.
Also Read: Praja Palana : ప్రస్తుత పెన్షన్ దారులు ప్రజాపాలన దరఖాస్తు చేసుకోవాలా..?
ఇటీవల పూంచ్ సెక్టార్లో జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు జవాన్లు అమరులయ్యాక.. పరిసర ప్రాంతాలకు చెందిన పలువురిని ఆర్మీ అధికారులు అదుపులోకి తీసుకొని విచారించారు. ఈక్రమంలో ఆర్మీ కస్టడీలో ముగ్గురు యువకులు చనిపోవడం వివాదాస్పదంగా మారింది. దీంతో బ్రిగేడియర్ స్థాయి అధికారిపై ఆర్మీ చర్యలు తీసుకుంది. ఈనేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ కశ్మీర్ పర్యటన ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఇటీవల ఆర్మీ ఇంటరాగేషన్లో చనిపోయిన ముగ్గురు కశ్మీరీ యువకుల కుటుంబాలను కూడా రాజ్నాథ్ పరామర్శిస్తారని తెలుస్తోంది.