Day 6 – Tunnel Drilling : 40 మంది కార్మికులు ఆరో రోజూ టన్నెల్ లోపలే.. ఏమవుతోంది ?
Day 6 - Tunnel Drilling : ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో ఉన్న సిల్కియారా టన్నెల్లో 40 మంది కార్మికులు చిక్కుకొని నేటికి 6 రోజులు.
- Author : Pasha
Date : 17-11-2023 - 10:19 IST
Published By : Hashtagu Telugu Desk
Day 6 – Tunnel Drilling : ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో ఉన్న సిల్కియారా టన్నెల్లో 40 మంది కార్మికులు చిక్కుకొని నేటికి 6 రోజులు. వారిని రక్షించే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా శిథిలాలను తొలగించే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. గురువారం రాత్రి 900 మిమీ వ్యాసం ఉన్న ఉక్కు పైపులను శిథిలాలలోకి చొప్పించారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు అమెరికాకు చెందిన ఆగర్ డ్రిల్లింగ్ మెషిన్తో సొరంగంలో పేరుకుపోయిన శిథిలాలను 21 మీటర్ల మేర డ్రిల్లింగ్ చేశారు. కార్మికులను చేరుకోవడానికి దాదాపు 45 నుంచి 60 మీటర్ల వరకు డ్రిల్లింగ్ చేయాల్సి ఉంటుందని అంచనా. ఆగర్ యంత్రంతో గంటకు 5 మీటర్లు డ్రిల్లింగ్ చేస్తున్నారు. ఈ లెక్కన రేపు సాయంత్రంలోగా రెస్క్యూ ఆపరేషన్ పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కూలిపోయిన సొరంగం శిథిలాలు గట్టిగా ఉండటంతో.. శుక్రవారం ఉదయం కాసేపు డ్రిల్లింగ్ ప్రక్రియను నిలిపివేశారు.
కార్మికులతో టచ్లో అధికారులు..
ఈ డ్రిల్లింగ్ ఆపరేషన్లో ఇండియన్ నేవీ సైతం కీలక పాత్ర పోషిస్తోంది. అమెరికాకు చెందిన ఆగర్ డ్రిల్లింగ్ మెషిన్ను విమానంలో సైట్కు తరలించారు. ఇలాంటి ఆపరేషన్లలో అనుభవం ఉన్న నార్వే, థాయిలాండ్ నిపుణులను రెస్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్న అధికారులు సంప్రదిస్తున్నారు. కార్మికులకు ధైర్యం చెప్పేందుకు అధికారులు ఎప్పటికప్పుడు కార్మికులతో మాట్లాడుతున్నారు. వారికి పైపుల ద్వారా ఆహారం, నీరు, ఆక్సిజన్ అందిస్తున్నారు. పరిస్థితిని తెలుసుకోవడానికి వాకీ టాకీల ద్వారా సంప్రదింపులు జరుపుతున్నారు. సొరంగం దగ్గర వైద్య సదుపాయం ఏర్పాటు చేశారు. వారిని బయటికి తీయగానే చికిత్స అందించేందుకు సొరంగం సమీపంని ఆసుపత్రులలో అన్ని ఏర్పాట్లు చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
ఏమిటీ సొరంగం ? ఏం జరిగింది ?
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో బ్రహ్మఖల్ యమునోత్రి జాతీయ రహదారిపై సిల్కియారా నుంచి దండల్ గావ్ వరకు ఈ సొరంగ మార్గాన్ని నిర్మిస్తున్నారు. చార్ ధామ్ రోడ్ ప్రాజెక్ట్ కింద ఈ టన్నెల్ను నిర్మిస్తున్నారు. దీన్ని నిర్మిస్తే ఉత్తరకాశీ నుంచి యమునోత్రి ధామ్ వరకు 26 కిలోమీటర్ల మేర ప్రయాణ దూరం తగ్గుతుంది. సిల్క్యారా పరిధిలో నాలుగున్నర కిలోమీటర్ల పొడవునా నిర్మితమవుతున్న ఈ సొరంగంలోని 150 మీటర్ల భాగం గత ఆదివారం(నవంబరు 11న) ఉదయం కూలిపోయింది. దీంతో అక్కడ పనులు చేస్తున్న 40 మంది కార్మికులు(Day 6 – Tunnel Drilling) చిక్కుకుపోయారు.