Delhi Blast: ఢిల్లీ బ్లాస్ట్.. వెలుగులోకి మరో సంచలన విషయం!
దాడికి పాల్పడిన వ్యక్తి డాక్టర్ ఉమర్ అని దర్యాప్తు సంస్థలు మొదటి నుంచీ అనుమానిస్తున్నాయి. ఉమర్ పేలుడు జరగడానికి కేవలం 11 రోజుల ముందు ఈ దాడికి ఉపయోగించిన తెలుపు రంగు హ్యుందాయ్ ఐ20 కారును కొనుగోలు చేశాడు.
- By Gopichand Published Date - 09:45 AM, Thu - 13 November 25
Delhi Blast: ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో నవంబర్ 10న జరిగిన ఘోరమైన పేలుడు (Delhi Blast) దర్యాప్తు పురోగమిస్తున్న కొద్దీ ప్రతిరోజూ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం వెల్లడైంది. దీని ద్వారా ఇది పూర్తిగా ప్రణాళికాబద్ధమైన ఉగ్రదాడి అని దాదాపుగా నిర్ధారణ అయింది. పోలీసులు, ఫోరెన్సిక్ బృందం బుధవారం అర్ధరాత్రి ధృవీకరించిన వివరాల ప్రకారం.. పేలుడు పదార్థాలతో నిండిన హ్యుందాయ్ ఐ20 కారులో ఉన్న వ్యక్తి మరెవరో కాదు ఉగ్రవాది డాక్టర్ ఉమర్ నబీ (ఉమర్ మొహమ్మద్) అని తేలింది. కారు శిథిలాల నుంచి లభించిన కాలిపోయిన మృతదేహం DNA టెస్ట్ ఫలితం ఉమర్ కుటుంబ సభ్యుల నమూనాలతో 100% మ్యాచ్ అయింది.
మొదటి నుంచీ అనుమానం
దాడికి పాల్పడిన వ్యక్తి డాక్టర్ ఉమర్ అని దర్యాప్తు సంస్థలు మొదటి నుంచీ అనుమానిస్తున్నాయి. ఉమర్ పేలుడు జరగడానికి కేవలం 11 రోజుల ముందు ఈ దాడికి ఉపయోగించిన తెలుపు రంగు హ్యుందాయ్ ఐ20 కారును కొనుగోలు చేశాడు. ఫరీదాబాద్లోని ‘వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్’లో ఉమర్ కీలక సభ్యుడు. పుల్వామాలోని సంబూరా నివాసి అయిన ఉమర్ కుటుంబ సభ్యులను ఢిల్లీ పోలీసులు ప్రశ్నించారు.
ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్.. ఉమర్ తల్లి, సోదరుడి నుండి DNA నమూనాలను సేకరించింది. పేలుడులో ఉపయోగించిన కారు శిథిలాల నుంచి లభించిన అవశేషాలు (ఎముకలు, దంతాలు, బట్టల ముక్కలు) ఈ నమూనాలతో సరిపోయాయి. DNA నమూనా మ్యాచ్ అవడంతో కారును ఉమరే నడుపుతున్నాడని ఖచ్చితమైంది.
Also Read: Railway New Rule: పిల్లలతో కలిసి రైలు ప్రయాణం చేసేవారికి గుడ్న్యూస్!
భయంతో తొందరపడి పేల్చేశాడు
ఉమర్ భద్రతా ఏజెన్సీలకు భయపడి తొందరపాటులో కారుతో పాటు తనను తాను కూడా పేల్చుకున్నట్లు తెలుస్తోంది. ఉమర్ మత మౌఢ్యంతో మారాడని కుటుంబ సభ్యులకు ముందే తెలుసని, అయితే వారు ఈ విషయాన్ని భద్రతా ఏజెన్సీలకు చెప్పలేదని వర్గాలు తెలిపాయి. ఉమర్ టర్కీలోని అంకారాలో ఉన్న తన హ్యాండ్లర్ ‘UKasa’ (కోడ్నేమ్ అయ్యే అవకాశం ఉంది)తో ‘సెషన్ యాప్’ ద్వారా నిరంతరం సంప్రదింపుల్లో ఉన్నాడు.
టర్కీ రాయబార కార్యాలయం సహకారం కోరిన NIA
వర్గాల సమాచారం ప్రకారం.. మార్చి 2022లో కొంతమంది వ్యక్తులు భారత్ నుండి అంకారాకు వెళ్లారు. వీరిలో ఉమర్తో పాటు ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్లో పట్టుబడిన ఇతర అనుమానితులు కూడా ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అదే సమయంలో వారికి బ్రెయిన్ వాష్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు NIA (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) దీనిని ధృవీకరించడానికి న్యూఢిల్లీలోని టర్కీ (తుర్కియే) రాయబార కార్యాలయాన్ని సంప్రదించింది. ఈ విషయంలో సహకారం కోరింది. దీంతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (CCS) సమావేశంలో ప్రభుత్వం ఢిల్లీ కారు పేలుడును ‘ఉగ్రదాడి’గా ప్రకటించింది.