Amit Shah: లోక్సభలో భగ్గుమన్న అవినీతి వ్యతిరేక బిల్లు!
చట్టం అందరికీ సమానమని, ఈ బిల్లు ఆమోదం పొందితే మంత్రి స్థాయిలో జవాబుదారీతనం మరింత పెరుగుతుందని హోంమంత్రి పునరుద్ఘాటించారు.
- By Gopichand Published Date - 07:00 PM, Wed - 20 August 25

Amit Shah: లోక్సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) అవినీతికి సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టడంతోనే ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ప్రభుత్వం రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తోందని నినాదాలు చేశాయి. “రాజ్యాంగాన్ని నాశనం చేయవద్దు” వంటి నినాదాలతో సభ మార్మోగింది. ఈ గందరగోళం మధ్య అమిత్ షా ప్రతిపక్షంపై ఎదురుదాడి చేశారు. “నాపై కూడా తప్పుడు ఆరోపణలు వచ్చినప్పుడు.. నేను స్వయంగా రాజీనామా చేశాను. కోర్టు నన్ను నిర్దోషిగా ప్రకటించే వరకు నేను ఏ పదవిని చేపట్టలేదు” అని ఆయన అన్నారు. అమిత్ షా మాట్లాడుతుండగా.. ప్రతిపక్ష ఎంపీలు పేపర్లు చించి ఆయన వైపు విసిరారు.
అమిత్ షా వ్యాఖ్యలు, ప్రతిపక్షాల ఆందోళన
చట్టం అందరికీ సమానమని, ఈ బిల్లు ఆమోదం పొందితే మంత్రి స్థాయిలో జవాబుదారీతనం మరింత పెరుగుతుందని హోంమంత్రి పునరుద్ఘాటించారు. ఆయన ఈ వ్యాఖ్యలతో సభలో ఉద్రిక్తత మరింత పెరిగింది. హోంమంత్రి ప్రవేశపెట్టిన ఈ బిల్లును ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్ నాయకుడు మనీష్ తివారీ కూడా వ్యతిరేకించారు. “ఇది రాజకీయ దుర్వినియోగానికి దారి తీస్తుందని భయపడుతున్నాను. ఈ మూడు బిల్లులను నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను” అని మనీష్ తివారీ అన్నారు. ఈ బిల్లును రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీతో పాటు సమాజ్వాదీ పార్టీ కూడా వ్యతిరేకించింది.
Also Read: Vice Presidential Election : సుదర్శన్ రెడ్డిని గెలిపించుకోవడం మనందరి బాధ్యత – సీఎం రేవంత్ పిలుపు
కేసీ వేణుగోపాల్ ప్రశ్నలు
భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడు కేసీ వేణుగోపాల్ కూడా ఈ బిల్లును వ్యతిరేకించారు. ఈ సందర్భంగా ఆయన అమిత్ షా గుజరాత్ హోంమంత్రిగా ఉన్నప్పుడు అరెస్ట్ అయిన విషయాన్ని ప్రస్తావించారు. దీనికి అమిత్ షా బదులిస్తూ “నేను నైతికత ఆధారంగా రాజీనామా చేశాను. నేను నిర్దోషిగా నిరూపించబడ్డాను” అని అన్నారు. దీనిపై ధర్మేంద్ర యాదవ్ “మీరు నైతికత గురించి మాట్లాడుతున్నారా?” అని ప్రశ్నించారు.
బిల్లు ఉద్దేశం, సభ వాయిదా
ఈ రాజ్యాంగ సవరణ బిల్లు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఒకవేళ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి లేదా ఏ మంత్రి అయినా ఏదైనా నేరారోపణ కేసులో ఇరుక్కుంటే, వారు 30 రోజుల్లోగా తమ పదవికి రాజీనామా చేయాలి. రాజకీయ నైతికత, పరిపాలనా పారదర్శకతను బలోపేతం చేయడానికి ఈ నిబంధనను తీసుకువచ్చారు. ప్రతిపక్షం ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించింది. తీవ్ర గందరగోళం, నినాదాల మధ్య లోక్సభ కార్యకలాపాలు వాయిదా పడ్డాయి.