Delhi Coaching Centre Flooding: ఢిల్లీ కోచింగ్ సెంటర్ ప్రమాదం కేసులో మరో ఐదుగురు అరెస్ట్
ఢిల్లీలోని ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ఘటనలో మరో ఐదుగురు అరెస్ట్ అయ్యారు. అయితే ఈ ఐదుగురు బిల్డింగ్ యజమానులు కావడం విశేషం. ఏ ఘటనకు భాద్యులైన ఎవరినీ ఉపేక్షించేది లేదన్నారు సెంట్రల్ డీసీపీ ఎం హర్షవర్ధన్
- Author : Praveen Aluthuru
Date : 29-07-2024 - 12:19 IST
Published By : Hashtagu Telugu Desk
Delhi Coaching Centre Flooding: ఢిల్లీలోని రాజేంద్ర నగర్ లో ఉన్న రావూస్ కోచింగ్ సెంటర్ ప్రమాదం కేసులో మరో ఐదుగురు నిందితులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో నలుగురు భవన యజమానులే కావడం విశేషం. ఈ భవనానికి నలుగురు యజమానులు ఉన్నారు. సరబ్జిత్ సింగ్, తేజిందర్ సింగ్, హర్విందర్ సింగ్ మరియు పర్విందర్ సింగ్. ఈ నలుగురు కరోల్ బాగ్లో నివసిస్తున్నారు. వీరి భవన బేస్మెంట్ ప్రాంతాన్ని రావు ఐఏఎస్ కోచింగ్ సెంటర్ యజమాని అభిషేక్ గుప్తాకు నెలవారీ అద్దె రూ.4 లక్షలకు ఇచ్చారు.
సెంట్రల్ డీసీపీ ఎం హర్షవర్ధన్ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. ఈ కేసులో మరో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు, దీంతో ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య ఏడుకు చేరింది. అరెస్టయిన వారిలో బేస్మెంట్ యజమాని మరియు భవనం గేటుకు నష్టం కలిగించి వాహనం నడిపిన వ్యక్తి ఉన్నారు. డిసిపి ఎం హర్షవర్ధన్ మాట్లాడుతూ “ఈ సంఘటనలో దోషులను ఉపేక్షించేది లేదన్నారు. సంఘటనకు బాధ్యులైన వారిపై మేము కఠిన చర్యలు తీసుకుంటాము. ప్రాంతంలో శాంతిభద్రతలను పరిరక్షిస్తున్నామని ఆయన చెప్పారు.
బిల్డింగ్ బేస్మెంట్లో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించడానికి అనుమతి లేదని అన్నారు. ఢిల్లీ మున్సిపల్ అధికారులతో కూడా మాట్లాడినట్లు, కేసును అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అటు విద్యార్థుల నిరసనలపై ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఢిల్లీలో శాంతిభద్రతలను కాపాడాలని, ప్రధాన రహదారులను దిగ్బంధించవద్దని ఆందోళన చేస్తున్న విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తున్నామని, ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.
నిబంధనలు ఉల్లంఘించే కోచింగ్ సెంటర్లపై ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) చర్య ప్రారంభించిన తర్వాత, ఇన్స్టిట్యూట్ల యజమానులు సోమవారం బేస్మెంట్ లైబ్రరీని ఉపయోగించే విద్యార్థులను ఖాళీ చేయమని కోరారు. విద్యార్థుల నిరసనల మధ్య, బిల్డింగ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు కరోల్ బాగ్లోని 13 కోచింగ్ సెంటర్ల బేస్మెంట్లను సీల్ చేశారు. బేస్మెంట్లలో అక్రమంగా నడుస్తున్న కోచింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని మేయర్ షెల్లీ ఒబెరాయ్ ఆదేశించారు.
Also Read: Office Desk : వర్క్ డెస్క్ను ఎలా మెయింటైన్ చేయాలో తెలుసా ?