Delhi Liquor Scam: మోడీకి రూ.1000 కోట్లు ఇచ్చానని చెబితే అరెస్ట్ చేస్తారా?
నేను మోడీకి 1000 కోట్లు ఇచ్చానని చెబితే అరెస్ట్ చేస్తారా అంటూ ప్రశ్నించారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణలో భాగంగా సీబీఐ కేజ్రీవాల్ కు నోటీసులు జారీ చేసింది
- Author : Vamsi Chowdary Korata
Date : 15-04-2023 - 2:29 IST
Published By : Hashtagu Telugu Desk
Delhi Liquor Scam: నేను మోడీకి 1000 కోట్లు ఇచ్చానని చెబితే అరెస్ట్ చేస్తారా అంటూ ప్రశ్నించారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణలో భాగంగా సీబీఐ కేజ్రీవాల్ కు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఆదివారం సీబీఐ విచారణ ఎదుర్కోనున్నారు కేజ్రీవాల్. వివరాలలోకి వెళితే..
దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది ఢిల్లీ మద్యం పాలసీ. ఢిల్లీ మద్యం పాలసీలో అవినీతి జరిగినట్టు విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ రంగంలోకి దిగాయి. ఈ కేసులో ఇప్పటికే పలువురు అరెస్ట్ కాగా.. తాజాగా తెలంగాణ సీఎం కుమార్తె కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ ఎదుర్కొంది. కాగా.. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈ కుంభకోణంలో ఉన్నట్టు అనుమానిస్తూ సీబీఐ నోటీసులిచ్చింది. ఆదివారం విచారణకు రావలసిందిగా పేర్కొంటూ నోటీసులు పంపించింది. ఈ మేరకు కేజ్రీవాల్ స్పందించారు.
ఢిల్లీ మద్యం పాలసీ (Delhi Liquor Policy) అద్భుతమైన పాలసీ అని అన్నారు సీఎం కేజ్రీవాల్. ఈ కేసులో అరెస్ట్ అయిన వారిని దర్యాప్తు సంస్థలు వేధిస్తున్నాయి. వారి వద్ద బలవంతంగా వాంగ్మూలం తీసుకున్నారు . కానీ తర్వాత అరుణ్ పిళ్ళై, సమీర్ మహేంద్ర తమ వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకున్నారు. ఈ కేసులో మనీష్ సిసోడియాని అనవసరంగా ఇరికిస్తున్నారు అంటూ అసహనం వ్యక్తం చేశారు. గోవా ఎన్నికల్లో అవినీతి డబ్బు ఖర్చు పెట్టామని అంటున్నారు. గోవా ఎన్నికల్లో ఎంత డబ్బు ఖర్చు చేశామో ఈసీకి అన్ని వివరాలు అందించాము. నేను మోడీకి 1000 కోట్లు ఇచ్చాను అని చెబితే మోడీని అరెస్ట్ చేస్తారా అంటూ ప్రశ్నించారు అరవింద్ కేజ్రీవాల్. ఈ మేరకు రేపు ఆదివారం సీబీఐ విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు.
Read More: Delhi Liquor scam : కవితకు షర్మిల `కిక్`, రాజకీయ నిషా