Israel-Iran Conflict : పశ్చిమాసియా వ్యాప్తంగా ఎయిర్పోర్టుల మూసివేత
ముఖ్యంగా గగనతలంపై ఆంక్షలతో పాటు విమానాశ్రయాల మూసివేత వల్ల వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయారు. ఈ యుద్ధం నేపథ్యంలో మొదటగా ఇరాన్ తన గగనతలాన్ని పూర్తిగా మూసివేసింది. అంతకుముందు ఎప్పుడూ ఆగని తేహ్రాన్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పుడు నిశ్శబ్దంగా మారిపోయింది.
- Author : Latha Suma
Date : 17-06-2025 - 12:12 IST
Published By : Hashtagu Telugu Desk
Israel-Iran Conflict : ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య నడుస్తున్న ఉద్రిక్తతలు ఐదో రోజు మరింత తీవ్రతను సంతరించుకున్నాయి. ఒకరిపై ఒకరు ప్రతీకార దాడులకు దిగుతున్న ఈ రెండు దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధం ప్రభావం పశ్చిమాసియా అంతటా కనపడుతోంది. ముఖ్యంగా గగనతలంపై ఆంక్షలతో పాటు విమానాశ్రయాల మూసివేత వల్ల వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయారు. ఈ యుద్ధం నేపథ్యంలో మొదటగా ఇరాన్ తన గగనతలాన్ని పూర్తిగా మూసివేసింది. అంతకుముందు ఎప్పుడూ ఆగని తేహ్రాన్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పుడు నిశ్శబ్దంగా మారిపోయింది. ఇదే సమయంలో ఇజ్రాయెల్ కూడా తాను ఎదుర్కొంటున్న రాకెట్ల ముప్పు కారణంగా ప్రధాన విమానాశ్రయాన్ని మూసివేసింది. ప్రత్యేకించి టెల్ అవీవ్ పరిధిలో ఉన్న బెన్ గురియన్ ఎయిర్పోర్ట్ పూర్తి స్థాయిలో మూతపడింది.
Read Also: Air India Plane Crash: విమాన ప్రమాదంలో క్రికెటర్ దుర్మరణం.. ఆలస్యంగా వెలుగులోకి!
ఈ పరిణామాలు లెబనాన్, జోర్డాన్, ఇరాక్ దేశాల గగనతలాన్ని కూడా ప్రభావితం చేశాయి. ఈ దేశాలు కూడా తమ విమానాశ్రయాల్లో సేవలను నిలిపివేసాయి. ఫలితంగా అంతర్జాతీయ ప్రయాణాలు పూర్తిగా గందరగోళానికి లోనయ్యాయి. అనేక విమానాలు మద్దతు లేక వాయిదా వేయబడ్డాయి లేదా మార్గమధ్యంలోనే తిరిగిపోవాల్సి వచ్చింది. పర్యాటకులు, విద్యార్ధులు, వ్యాపార ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు, ఈ ఉద్రిక్తతల నేపథ్యంగా సోమవారం తెల్లవారుఝామున ఇరాన్ కీలక అణు స్థావరాలపై భారీ రాకెట్ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఉన్నతస్థాయి సైనికాధికారులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. దీనికి ప్రతీకారంగా ఇరాన్ ఉదయం టెల్ అవీవ్, పెటా తిక్వా ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు ప్రయోగించింది.
ఈ దాడుల్లో కనీసం 8 మంది ఇజ్రాయెల్ పౌరులు మృతి చెందినట్లు అధికారికంగా ప్రకటించారు. పలు నివాసాలు ధ్వంసమయ్యాయి. శబ్దాలు, పేలుళ్లు, పొగలతో నగరం అలజడి వాతావరణాన్ని అనుభవిస్తోంది. ఇజ్రాయెల్ రక్షణ శాఖ ఈ దాడులకు సంబంధించి విడుదల చేసిన వీడియోల్లో టెహ్రాన్ విమానాశ్రయం సమీపంలో రెండు ఎఫ్-14 యుద్ధవిమానాలు పూర్తిగా ధ్వంసమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో యుద్ధ విరమణకి అవకాశాలు కనిపించకుండా ఉండటంతో, పశ్చిమాసియాలో మరోమారు గణనీయమైన మానవీయ సంక్షోభం తలెత్తే అవకాశముందని అంతర్జాతీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. విమానాశ్రయాల మూసివేత, గగనతల ఆంక్షలు ఇవన్నీ సామాన్య ప్రయాణికులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి.
Read Also: ATMs : ఆర్బీఐ గడువుకు ముందే పురోగతి..ఏటీఎంల్లో పెరిగిన రూ.100, రూ.200 నోట్ల లభ్యత