Court battle : 80 ఏళ్ళ న్యాయపోరులో గెలిచిన 93 ఏళ్ల అలిస్ డిసౌజా ఎవరు ?
93 ఏళ్ల మహిళ అలిస్ డిసౌజా సుదీర్ఘ న్యాయ పోరాటం ఫలించింది. దీంతో ఒక ఏడాది కాదు.. రెండేళ్లు కాదు.. గత 80 ఏళ్లుగా (court battle 80 years) దక్షిణ ముంబైలో కొనసాగుతున్న ఆస్తి వివాదానికి ఎట్టకేలకు తెరపడింది.
- By Pasha Published Date - 09:06 PM, Sat - 6 May 23
93 ఏళ్ల మహిళ అలిస్ డిసౌజా సుదీర్ఘ న్యాయ పోరాటం ఫలించింది. దీంతో ఒక ఏడాది కాదు.. రెండేళ్లు కాదు.. గత 80 ఏళ్లుగా (court battle 80 years) దక్షిణ ముంబైలో కొనసాగుతున్న ఆస్తి వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. ఈ కేసును బాంబే హైకోర్టు పరిష్కరించింది. దక్షిణ ముంబైలోని రూబీ మాన్షన్ మొదటి అంతస్తులో ఉన్న రెండు ఫ్లాట్లను వృద్ధురాలు అలిస్ డిసౌజాకు అప్పగించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. న్యాయమూర్తులు జస్టిస్ ఆర్డీ ధనుక, ఎంఎం సతయేలతో కూడిన డివిజన్ బెంచ్ మే 4న ఈమేరకు తీర్పు ఉత్తర్వులను జారీ చేసింది. ఈ రెండు వివాదాస్పద ఫ్లాట్లు చెరో 500 చదరపు అడుగులు, 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయి.
ALSO READ : High Court: హైకోర్టు సంచలనం, మేజిస్ట్రేట్ పై విచారణకు ఆదేశం
అలిస్ డిసౌజాకు చెందిన ఫ్లాట్లు ఉన్న ప్రయివేట్ బిల్డింగ్ (రూబీ మాన్షన్) ను 1942 మార్చి 28న అప్పటి బ్రిటీష్ పాలకులు అకస్మాత్తుగా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నారు. వాటిని అప్పటి ప్రభుత్వ అధికారులకు క్వార్ట్రర్స్ గా మార్చారు . అయితే అలిస్ డిసౌజా సహా ఆ భవనంలోని ఫ్లాట్ల యజమానులు కోర్టును ఆశ్రయించడంతో 1946 జూలైలో ఆ బిల్డింగ్ ను అధికారులకు కేటాయించడానికి వ్యతిరేకంగా న్యాయస్థానం తీర్పు వచ్చింది. ఫ్లాట్లను వాటి అసలు యజమానులకు తిరిగి ఇచ్చేయాలని ఆర్డర్స్ ఇచ్చింది. కానీ 2 ఫ్లాట్లను మాత్రం వాటి అసలు యజమాని అయినా అలిస్ డిసౌజాకు తిరిగి అప్పగించకుండా కొందరు మాజీ అధికారుల కుటుంబాలు కబ్జా చేశాయి. దీనిపై అలిస్ డిసౌజా హైకోర్టులో పిటిషన్ వేశారు. 80 ఏళ్ళపాటు న్యాయ పోరాటం (court battle 80 years) కొనసాగించారు. తన ఆస్తుల స్వాధీనాన్ని రద్దు చేస్తూ 1946లో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని, ఆస్తిని తనకు తిరిగి ఇచ్చేలా మహారాష్ట్ర ప్రభుత్వం, ముంబై కలెక్టర్లను ఆదేశించాలని కోర్టును కోరారు. ఈ అభియోగాలతో ఏకీభవించిన బాంబే హైకోర్టు.. 8 వారాల్లో వాటిని అలిస్ డిసౌజాకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.