కొత్త సిలిండర్ బుకింగ్ రూల్స్.. మే 1 నుండి మారనున్న నిబంధనలు?
దేశీయంగా గ్యాస్ అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. భారత్కు రోజువారీ అవసరమైన 80,000 టన్నుల ఎల్పిజిలో కేవలం 46,000 టన్నులు మాత్రమే మన దేశంలో ఉత్పత్తి అవుతోంది.
- Author : Gopi
Date : 26-04-2026 - 1:20 IST
Published By : Hashtagu Telugu Desk
Gas Cylinder Booking Rules: మిడిల్ ఈస్ట్లోని హోర్ముజ్ స్ట్రైట్ దిగ్బంధం కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు, గ్యాస్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఈ పరిణామాల వల్ల దేశంలో రాబోయే రోజుల్లో వంట గ్యాస్ కొరత ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు దేశంలోని మూడు ప్రధాన చమురు సంస్థలైన ఇండియన్ ఆయిల్, భారత్ గ్యాస్, హెచ్పి గ్యాస్ మే 1, 2026 నుండి సిలిండర్ బుకింగ్ నిబంధనలను మార్చాలని యోచిస్తున్నాయి. ఈ కొత్త నిబంధనలు అమలులోకి వస్తే సామాన్య ప్రజల గ్యాస్ బుకింగ్, డెలివరీ ప్రక్రియలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి.
కొత్త ప్రతిపాదనల ప్రకారం.. ప్రతి నెల మొదటి తేదీన గ్యాస్ ధరలు, కంపెనీ విధానాల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా రెండు సిలిండర్ల బుకింగ్ మధ్య కనీసం 25 రోజుల విరామం (గ్యాప్) ఉండటాన్ని తప్పనిసరి చేసే దిశగా చర్చలు జరుగుతున్నాయి. దీనితో పాటు ప్రస్తుతం అక్కడక్కడా అమలవుతున్న ఓటీపీ (OTP) ఆధారిత డెలివరీ విధానాన్ని దేశవ్యాప్తంగా శాశ్వతం చేయనున్నారు. దీనివల్ల సిలిండర్ డెలివరీకి వచ్చే ముందు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు వచ్చే కోడ్ను డెలివరీ బాయ్కు చెబితేనే గ్యాస్ సిలిండర్ అందజేస్తారు. లేదంటే సిలిండర్ పొందే అవకాశం ఉండదు.
Also Read: ప్రేమ పేరుతో ట్రాప్.. రూ. 9 కోట్ల మోసం చేసిన అషు రెడ్డి
దేశీయంగా గ్యాస్ అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. భారత్కు రోజువారీ అవసరమైన 80,000 టన్నుల ఎల్పిజిలో కేవలం 46,000 టన్నులు మాత్రమే మన దేశంలో ఉత్పత్తి అవుతోంది. మిగిలిన అవసరాల కోసం గల్ఫ్ దేశాలపై ఆధారపడటం తగ్గించి, ఇప్పుడు అమెరికా, రష్యా, కెనడా, నార్వే వంటి దాదాపు 15 దేశాల నుండి దిగుమతులు చేసుకునేలా వ్యూహాన్ని మార్చింది. ఇప్పటికే అమెరికా నుండి అదనపు నిల్వలను ఆర్డర్ చేయగా, అవి జూన్-జూలై నాటికి దేశానికి చేరనున్నాయి. అకస్మాత్తుగా ఏర్పడే కొరతను అధిగమించేందుకు మార్కెట్ నుండి నేరుగా కొనుగోలు చేసే ‘స్పాట్ పర్చేజ్’ విధానాన్ని కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. గ్యాస్ వినియోగదారులు ఈ మార్పులను గమనించి తదనుగుణంగా సిద్ధంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.