Fasting: ఉపవాసం ఉండేవాళ్ళు ఎలాంటి పద్ధతులను అనుసరించాలో తెలుసా?
ఉపవాసం ఉండేవారు కొన్ని రకాల నియమాలను తప్పకుండా పాటించాలని ఒకవేళ పాటించకపోతే ఆ ఉపవాసం ఫలితం దక్కదని చెబుతున్నారు పండితులు.
- By Anshu Published Date - 12:00 PM, Wed - 7 August 24

మామూలుగా హిందూమతంలో ఏడాది పొడవునా పండుగలు వస్తూనే ఉంటాయి. అయితే ఈ పవిత్రమైన రోజుల్లో దేవుళ్లకు భక్తిశ్రద్ధలతో పూజించడంతో పాటుగా కొంతమంది ఉపవాసాలు కూడా ఉంటారు. ఉపవాసం ఉండి దేవుడిని ప్రత్యేకంగా పూజించడం వల్ల ఆ దైవ అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. అయితే ఉపవాసం ఉండడం మంచిదే కానీ ఉపవాసం ఉండేటప్పుడు కొన్ని రకాల విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలట. అలాగే కొన్ని పద్ధతులను అనుసరించాలని పండితులు చెబుతున్నారు. కొన్ని ఆచారాలను పద్ధతులను పాటించకుండా మీరు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నా ఎన్ని గంటలు ఉపవాసం ఉన్నా దాని ఫలితం మీకు దక్కదు అని చెబుతున్నారు పండితులు.
మరి ఉపవాస ఫలితం దక్కాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మీరు ఉపవాస తీర్మానాన్ని తీసుకోవడం ద్వారా ఉపవాసాన్ని ప్రారంభించాలి. చాలా సందర్భాలలో, బ్రహ్మ ముహుర్తంలో స్నానం చేసిన తర్వాత మాత్రమే ఈ తీర్మానం తీసుకోవాలి. ఉపవాస తీర్మానంలో, ఉపవాస సమయ వ్యవధిని కూడా నిర్ణయించాలని చెబుతున్నారు. అలాగే తీర్మానం లేకుండా చేసిన ఉపవాస ఫలితం అసంపూర్ణంగా ఉంటుందట. ఉపవాసాల్లో కొన్ని రకాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి నిర్జలోపవాసం, జలోపవాసం, రసోపవాసం, ఫలోపవాసం. ఈ నాలుగు రకాల ఉపవాసాలు మన శరీరాన్ని శుద్ధి చేయడంలో ఎంతగానో సహాయపడతాయి. కాబట్టి మీ శరీరాన్ని బట్టి మీకు ఏది వీలవుతుందో అలాంటి ఉపవాసం మాత్రమే చేయాలని చెబుతున్నారు. జలోపవాసం అంటే ఉపవాసం ఉండే వారు అప్పుడప్పుడు నీరు తాగవచ్చు.
అయితే ఈ ఉపవాసంలో ఉండే వారు ఆహార పదార్థాలేవీ తీసుకోకుండా ఉండాలి. కనీసం 5 లీటర్ల వరకు తాగవచ్చు. ఉదయాన్నే పరగడుపన ఒక లీటర్ నీటిని తీసుకొని, అనంతరం ప్రతి రెండు గంటలకు ఒకసారి రెండు గ్లాసుల నీటిని తాగవచ్చు. రసోపవాసం అంటే పండ్లను తీసుకోవచ్చు. ఆరెంజ్, బత్తాయి, కొబ్బరి నీళ్లు వంటివి తీసుకోవచ్చు. ఫలోపవాసం అంటే ఫలాలు తీసుకోవచ్చు. ఉపవాసంలో ఉండే ఫ్రిజ్ లోని నీళ్లను అస్సలు తీసుకోకూడదు. అలాగే ఫ్రిజ్ లో ఉంచిన పండ్ల రసాలను కూడా తీసుకోకూడదు. సహజమైన నీళ్లనే మాత్రమే తాగాలి. అలాగే సహజ పండ్ల రసాలను తీసుకోవాలి. కొన్ని పండ్లను అప్పుడప్పుడు తినవచ్చు. అయితే ప్రతి ఉపవాస నియమాల నుండి పిల్లలకు, గర్భిణులకు, వయోజనులకు ఈ నిబంధనల నుండి మినహాయింపు ఉంటుంది. ఉపవాసం ఉండే వారు ఉదయాన్నే స్నానం చేసి, ఇంటిని శుభ్రం చేసి, ముఖ్యంగా పూజా గదిని శుద్ధి చేసి పూజా సామాగ్రి, సంబంధిత దేవుని విగ్రహం లేదా దేవుని ఫొటోలను పూజా గదిలో ప్రతిష్టించాలి. ఆ తర్వాత మీ ఆచారాలను బట్టి పూజను ప్రారంభించాలి.
అనంతరం భగవంతుడిని స్మరించుకోవాలని పండితులు చెబుతున్నారు. అలాగే ఉపవాసం ఉండే వారు తెల్లవారుజామున నిద్ర లేచి స్నానం చేసిన తర్వాత శుభ్రమైన ఉతికిన దుస్తులను మాత్రమే ధరించాలట. ఎట్టి పరిస్థితుల్లో నల్లని రంగులోని దుస్తులను ధరించకూడదని చెబుతున్నారు. వీలైతే పసుపు, తెల్లని, పచ్చని రంగులో ఉండే దుస్తులను ధరించాలని చెబుతున్నారు. ఉపవాసం ఉండే ప్రతి ఒక్కరూ విధిగా ఆ రోజంతా బ్రహ్మచార్యం పాటించాలట. మీ ఉపవాసం విజయవంతం కావడానికి, వ్యక్తి యొక్క మనసు ప్రశాంతంగా ఉండటం అవసరం. మీ మనసులో ఎలాంటి ప్రతికూల ఆలోచనలు రానీయకూడదని, ఎట్టి పరిస్థితుల్లో కోపం తెచ్చుకోకూడదని, ఎలాంటి చెడు ఆలోచనలు కూడా చేయకూడదని ఇలా ఈ నియమాలను అన్ని పాటించినప్పుడే ఉపవాస ఫలితం మీకు దక్కుతుందని పండితులు చెబుతున్నారు.