Lakshmi Nivasam: లక్ష్మీ నివాసం ఇలా ఉంటుందా..?
లక్ష్మీదేవి ఒకసారి ఒక వ్యక్తి పై అలిగి “నేను వెళ్లి పోతున్నాను. మీ ఇంటికి ఇక దరిద్ర దేవత రాబోతున్నది. కాకపోతే నీకో వరం వ్వదలచుకొన్నాను. అడుగు!” అని అంటుంది.
- Author : Vamsi Chowdary Korata
Date : 12-03-2023 - 7:00 IST
Published By : Hashtagu Telugu Desk
లక్ష్మీదేవి (Lakshmi Devi) ఒకసారి ఒక వ్యక్తి పై అలిగి “నేను వెళ్లి పోతున్నాను. మీ ఇంటికి ఇక దరిద్ర దేవత రాబోతున్నది. కాకపోతే నీకో వరం వ్వదలచుకొన్నాను. అడుగు!” అని అంటుంది. అప్పుడు ఆ వ్యక్తి లక్ష్మీదేవి తో ఇలా అంటాడు… “అమ్మా నీవు వెళ్లుతుంటే ఆపే శక్తి నాకు లేదు. అలాగే దరిద్రదేవత వస్తుంటే ఆపే శక్తి అంతకన్నా లేదు. మీలో ఒకరు వున్నచోట ఒకరు వుండరు. కాబట్టి దరిద్ర దేవత వచ్చిన వేళ మా ఇంటిలో ఇప్పుడు ఒకరిపట్ల ఒకరికున్న ప్రేమాభిమానాలు అలాగే వుండేటట్లు వరం ఇవ్వమ” ని అంటాడు. లక్ష్మీదేవి ‘తథాస్తు!’ అని వెళ్లిపోతుంది. కొన్నిరోజుల తర్వాత ఇంటిలో వంట చేస్తున్న ఆ వ్యక్తి భార్య కూరలో ఉప్పు కారం సమపాళ్ళలో వేయమని కోడళ్లకు చెప్పి గుడికి పోతుంది. కొంతసేపటికి చిన్న కోడలు ఉప్పు కారం కూరలో వేసి ఏదో పనిలో నిమగ్నమై పోతుంది.
ఇంకొంతసేపటికి పెద్దకోడలు వచ్చి కూరలో ఉప్పు వేశారో లేదో అని అనుమానం వచ్చి తనుకూడ ఆ కూరకు తగినంత ఉప్పు వేసి వేరేపనిలో పడిపోతుంది. ఇంతలో అత్తగారు వచ్చి కోడళ్లు ఇద్దరు తమ పనిలోపడి ఉప్పు వేశారో లేదో అని తనూ కొంత వేస్తుంది. మధ్యాహ్నం భోజనానికి ఆవ్యక్తి తను తినే సమయంలో కూరలో ఉప్పు ఎక్కువ అయినది గ్రహించి దరిద్ర దేవత ఇంటిలోకి ప్రవేశించింది అని తెలుసుకుంటాడు. ఏమి అనకుండా తిని లేస్తాడు. కొంత సేపటికి ఆ వ్యక్తి పెద్దకొడుకు కూడ భోజన సమయంలో ఉప్పు ఎక్కువ అయినది అని గ్రహించి ‘నాన్న గారు తిన్నారా?’ అని భార్యను అడుగుతాడు. ’తిన్నారు!’ అని చెబుతుంది. దానితో ‘నాన్న ఏమీ అనకుండ తిన్నాడు. నేనెందుకు అనాలి?’ అని ఏమి మాట్లాడకుండ తిని లేస్తాడు. ఇలా ఇంటి వాళ్లంతా తిని వంట గురించి మాటలాడకుండ వుంటారు.
ఆరోజు సాయంత్రం దరిద్ర దేవత ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి ‘నేను వెళ్లిపోతున్నాను. ఉప్పు కసిం అయిన వంట తిని కూడ మీ మధ్య ఏ స్పర్ధలు రాలేదు. మీరు ప్రేమగా ఐక్యమత్యంగా ఉన్నారు. ఇటు వంటి చోట నేనుండను!’ అని వెళ్లిపోతుంది. దరిద్ర దేవత వెళ్లిపోవటంతో ఆ ఇంట మళ్లీ లక్ష్మీదేవి నివాసం (Lakshmi Devi Nivasam) ఏర్పరచుకొంటుంది. ఏ ఇంటిలో ‘ప్రేమ, అప్యాయతలు మరియు శాంతి’ వుంటాయో ఆ ఇల్లు ‘లక్ష్మీ నివాసం’ అయ్యి వుంటుంది. ఈ కథ చదివిన వారి ఇంట లక్షీదేవి కొలువై ఉండాలని కోరుకొంటున్నాను. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్తా సుఖినోభవన్తు! రేపటి తరానికి బతుకు, భద్రతలతోపాటు భారతీయత కూడా నేర్పండి.
Also Read: Kanaka Durga Mantram: కఠిన సమస్యలని తీసివేసే కనక దుర్గా మంత్రం..