Vijayawada Durgamma Temple: దుర్గమ్మ ఆలయ క్యూలైన్ లో 50 లక్షల బంగారం మాయం !!
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ సన్నిధిలో భారీ చోరీ కలకలం రేపింది. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన ఒక భక్తురాలి నుండి ఏకంగా రూ.50 లక్షల విలువైన బంగారాన్ని దుండగులు అపహరించారు.
- Author : Sudheer
Date : 07-03-2026 - 12:23 IST
Published By : Hashtagu Telugu Desk
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ సన్నిధిలో భారీ చోరీ కలకలం రేపింది. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన ఒక భక్తురాలి నుండి ఏకంగా రూ.50 లక్షల విలువైన బంగారాన్ని దుండగులు అపహరించారు. హైదరాబాద్కు చెందిన ఒక మహిళ విజయవాడలో జరిగే ఒక వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వచ్చారు. శుభకార్యం ముగించుకుని, తిరిగి వెళ్లే ముందు అమ్మవారిని దర్శించుకోవాలని ఆమె ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. ప్రస్తుతం దుర్గమ్మ ఆలయంలో మహా కుంభాభిషేక మహోత్సవాలు జరుగుతుండటంతో భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. క్యూలైన్లలో తోపులాట, రద్దీని ఆసరాగా చేసుకున్న కేటుగాళ్లు.. సదరు మహిళా భక్తురాలి బ్యాగులో ఉన్న సుమారు రూ.50 లక్షల విలువైన బంగారు ఆభరణాలను అత్యంత చాకచక్యంగా దొంగిలించారు. దర్శనం అనంతరం బయటకు వచ్చి చూసుకునేసరికి నగలు మాయమవ్వడంతో బాధితురాలు కన్నీరుమున్నీరయ్యారు.
సీసీటీవీలకు ‘టెంట్’ల అడ్డంకి
బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన విజయవాడ వన్ టౌన్ పోలీసులు ఆలయ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. అయితే, కుంభాభిషేక మహోత్సవాల నేపథ్యంలో భక్తులకు ఎండ తగలకుండా అధికారులు క్యూలైన్ల పొడవునా భారీ టెంట్లను ఏర్పాటు చేశారు. ఈ టెంట్ల కారణంగా సీసీ కెమెరాల వ్యూ (View) కి ఆటంకం ఏర్పడింది. క్యూలైన్లలో ఏం జరుగుతుందో స్పష్టంగా కనిపించకపోవడంతో దొంగను గుర్తించడం పోలీసులకు సవాలుగా మారింది. భద్రతా పరంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ, తాత్కాలిక షెడ్ల వల్ల అవి నిరుపయోగంగా మారడం దొంగలకు కలిసివచ్చింది.
భక్తులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం
ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు భక్తులకు కీలక సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా కుంభాభిషేకం వంటి భారీ ఉత్సవాలు జరిగే సమయంలో అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు చురుగ్గా ఉంటాయని, రద్దీని ఆసరాగా చేసుకుని చేతివాటం ప్రదర్శిస్తారని హెచ్చరిస్తున్నారు. విలువైన ఆభరణాలు, భారీ నగదుతో ఆలయాలకు వచ్చేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు. ప్రస్తుతం పోలీసులు అనుమానితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆలయ పరిసరాల్లోని ఇతర మార్గాల్లో ఉన్న కెమెరాలను విశ్లేషిస్తూ నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.