రణవీర్ సింగ్ ధురంధర్ 2 ట్రైలర్ వచ్చేసింది..
- Author : Vamsi Chowdary Korata
Date : 07-03-2026 - 12:45 IST
Published By : Hashtagu Telugu Desk
Dhurandhar 2 బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ తన రాబోయే చిత్రం ‘ధురంధర్’ సీక్వెల్ కోసం పూర్తిస్థాయిలో సిద్ధమయ్యారు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ధూరందర్: ది రివెంజ్’ కోసం ఆయన ‘బీస్ట్ మోడ్’ ఆన్ చేసినట్లు కనిపిస్తోంది. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్, ప్రతీకారంతో రగిలిపోతున్న కథానాయకుడి పాత్రను పరిచయం చేస్తూ అంచనాలను భారీగా పెంచేసింది.
ఈ సినిమా కథ పూర్తిగా వ్యక్తిగత ప్రతీకారం చుట్టూ తిరుగుతుందని రణవీర్ సింగ్ సోషల్ మీడియా ద్వారా హింట్ ఇచ్చారు. “ఇది పర్సనల్ అని చెప్పాను కదా… ట్రైలర్ ఇప్పుడు విడుదలైంది” అంటూ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఈ సీక్వెల్లో తన పాత్ర హమ్జా సరికొత్త పంథాలో, మరింత తీవ్రమైన భావోద్వేగాలతో కనిపిస్తుందని స్పష్టం చేశారు. మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్లో రణవీర్ సింగ్… జస్కిరత్, హమ్జా అనే రెండు విభిన్న అవతారాల్లో భీకరంగా కనిపించారు. “ధైర్యం. ఇంధనం. ప్రతీకారం.” (Honsla. Eendhan. Badla.) అనే ట్యాగ్లైన్ సినిమా కథలోని తీవ్రతను తెలియజేస్తోంది.
ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్లో భారీ తారాగణం ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. వ్యూహకర్త అజయ్ సన్యాల్ పాత్రలో ఆర్. మాధవన్, ఐఎస్ఐ మేజర్ ఇక్బాల్గా నెగెటివ్ షేడ్స్తో అర్జున్ రాంపాల్, శక్తిమంతమైన ఎస్పీ చౌదరి అస్లాం పాత్రలో సంజయ్ దత్ తమదైన నటనతో ఉత్కంఠను పెంచబోతున్నారు. జియో స్టూడియోస్ సమర్పణలో, B62 స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఆదిత్య ధర్ స్వయంగా రచించి, దర్శకత్వం వహించి, నిర్మించడం విశేషం. జ్యోతి దేశ్పాండే, లోకేశ్ ధర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
ఈ చిత్రం కథకు వాస్తవ ఘటనల స్ఫూర్తి ఉంది. భారతదేశ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (RAW) నిర్వహించిన రహస్య ఆపరేషన్లు, ముఖ్యంగా ఆపరేషన్ ల్యారీ, 2008 ముంబై దాడులు, పలు క్రిమినల్ సిండికేట్లపై జరిపిన దాడుల ఆధారంగా ఈ కథను రూపొందించారు.
హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఉగాది, గుడి పడ్వా పండుగల సందర్భంగా ఈ నెల 19న ‘ధురంధర్: ది రివెంజ్’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ నెల 18న ప్రత్యేకంగా పెయిడ్ ప్రీమియర్లు కూడా ప్రదర్శించనున్నారు.