Black Warrant : నెట్ఫ్లిక్స్లో విడుదలైన ‘బ్లాక్ వారెంట్’.. స్టోరీ ఏమిటో తెలుసా ?
మొత్తం మీద ఇవాళ ‘బ్లాక్ వారెంట్’ వెబ్ సిరీస్ను ఎంతోమంది నెట్ఫ్లిక్స్లో(Black Warrant) చూశారు.
- By Pasha Published Date - 05:32 PM, Fri - 10 January 25

Black Warrant : ‘బ్లాక్ వారెంట్’ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్ వేదికగా ఇవాళ (జనవరి 10) విడుదల అయింది. జైలు కేంద్రంగా సాగే ఈ కథలో బాలీవుడ్ ఐకాన్ దివంగత శశి కపూర్ మనవడు జహాన్ కపూర్ ప్రధాన పాత్రను పోషించారు. దీనికి విక్రమాదిత్య మోత్వానీ దర్శకత్వం వహించారు. సిధాంత్ గుప్తా, అనురాగ్ ఠాకూర్, పరంవీర్ సింగ్ చీమా కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ జర్నలిస్ట్ సునేత్రా చౌదరి, తిహార్ జైలు మాజీ సూపరింటెండెంట్ సునీల్ గుప్తాలు కలిసి రాసిన ‘బ్లాక్ వారెంట్ : కన్ఫెషన్స్ ఆఫ్ ఎ తిహార్ జైలర్’ పుస్తకం ఆధారంగా ఈ వెబ్ సిరీస్ను తీశారు. వాస్తవిక గాథలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. వాటినే కళ్లకు కట్టేలా ‘బ్లాక్ వారెంట్’ వెబ్ సిరీస్లో చిత్రీకరించారు. దీనికి సంబంధించిన ట్రైలర్ను జనవరి 3న విడుదల చేశారు.
Also Read :Harvansh Singh Rathore : బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ సోదాలు..
సోషల్ మీడియాలో టాక్ ఇలా..
మొత్తం మీద ఇవాళ ‘బ్లాక్ వారెంట్’ వెబ్ సిరీస్ను ఎంతోమంది నెట్ఫ్లిక్స్లో(Black Warrant) చూశారు. వీరిలో పలువురు సోషల్ మీడియా వేదికగా తమదైన శైలిలో రివ్యూలు రాస్తున్నారు. వారి ప్రకారం.. బ్లాక్ వారెంట్ వెబ్ సిరీస్ పార్ట్ 1లో సునీల్ గుప్తా తిహార్ జైలులో పనిచేసిన తొలి నాలుగేళ్లలో జరిగిన సంఘటనల సమాచారం ఉంది. జైలులో ఉండే విధి విధానాలు, ఖైదీల సంక్షేమం కోసం అమలు చేసే సంస్కరణలు వంటి అంశాలను ఇందులో తెరకెక్కించినట్లు తెలిసింది. డైనమిక్ యంగ్ జైలర్ హోదాలో సునీల్ గుప్తా పాత్రలో జహాన్ కపూర్ చాలా బాగా నటించారనే టాక్ వినిపిస్తోంది. జైలులో ఖైదీల మధ్య జరిగే రాజకీయాలు, ఆధిపత్య పోరాటాలు, ఖైదీల మధ్య జరిగే ఘర్షణలు వంటి అంశాలు బ్లాక్ వారెంట్ వెబ్ సిరీస్లలో సవివరంగా చూపించబోతున్నారు. కరడుగట్టిన నేరస్తులను చూసిన తిహార్ జైలుతో ముడిపడిన స్టోరీ అంటే సహజంగానే అందరికీ ఆసక్తి కలుగుతుంది. అందుకే దీని వెబ్ సిరీస్లకు కూడా మంచి ఆదరణ లభించే అవకాశాలు ఉన్నాయి.
Also Read :BJP Announced MLC Candidates: తెలంగాణలోని మూడు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ
బ్లాక్ వారెంట్ అంటే..
బ్లాక్ వారెంట్ అంటే ఫైనల్ లీగల్ ఆర్డర్. ఏదైనా కేసులో దోషిగా తేలిన వ్యక్తిని ఉరి తీసేందుకు చిట్టచివరగా కోర్టు నుంచి బ్లాక్ వారెంట్ జారీ అవుతుంటుంది. సునీల్ గుప్తా జైలర్గా తన 40 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో ఇలాంటి 14 బ్లాక్ వారెంట్లను చూశారు. తిహార్ జైలులో జైలర్గా ఉన్న టైంలో ఆయనకు తారసపడిన ఖైదీలు, నేరగాళ్లు, వివాదాస్పద కేసుల చుట్టూ బ్లాక్ వారెంట్ వెబ్ సిరీస్ నడవనుంది.