Gaddar Awards 2025 : నభూతో న భవిష్యతి అన్నట్టు జరపాలి – భట్టి
Gaddar Awards 2025 : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి పునాది వేసిన గొప్ప నాయకుల్లో గద్దర్ ఒకరని కొనియాడారు. తెలంగాణ భావజాలాన్ని ప్రపంచానికి తెలిసేలా చేసిన గద్దర్
- Author : Sudheer
Date : 22-04-2025 - 2:25 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడిన మహానుభావుడు గద్దర్ (Gaddar ) మన రాష్ట్రంలో పుట్టడం మన అదృష్టమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు (Bhatti) అన్నారు. LV ప్రసాద్ సినీ ల్యాబ్లో మంగళవారం నిర్వహించిన గద్దర్ సినిమా అవార్డుల జ్యూరీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి పునాది వేసిన గొప్ప నాయకుల్లో గద్దర్ ఒకరని కొనియాడారు. తెలంగాణ భావజాలాన్ని ప్రపంచానికి తెలిసేలా చేసిన గద్దర్, చిన్న పిల్లల నుంచి ముసలి వరకూ తన పాటల ద్వారా ప్రభావం చూపించారని అన్నారు.
Raghu Engineering College : ఫోన్ తీసుకుందని లెక్చరర్ ను చెప్పుతో కొట్టిన విద్యార్థిని
గత పది సంవత్సరాల్లో రాష్ట్రంలో సినీ పరిశ్రమ నిరాదరణకు గురైందని , 2011లో ఆఖరి చలనచిత్ర అవార్డులు ఇచ్చిన తరువాత నుంచి ఈ రంగానికి తగిన ప్రోత్సాహం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే సినిమా రంగానికి గౌరవం కలిగించిన విధంగా, చిత్ర పరిశ్రమను హైదరాబాద్కు తీసుకురావడం ద్వారా అభివృద్ధికి బాటలు వేసిన విషయాన్ని గుర్తు చేశారు. కేవలం చిత్ర పరిశ్రమను తరలించడం కాదు, ఆ రంగానికి పని చేసే కళాకారులకు నివాస స్థలాలు కూడా కేటాయించిన నేపథ్యంలో, ప్రభుత్వ ప్రోత్సాహాన్ని వివరించారు.
ఇక గద్దర్ చలనచిత్ర అవార్డుల కార్యక్రమాన్ని “నభూతో నభవిష్యత్తు” అన్నట్టుగా అట్టహాసంగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం సూచించారు. ప్రపంచస్థాయిలో జరిగే చలనచిత్ర అవార్డుల ఉత్సవాల స్థాయిలోనే ఈ కార్యక్రమం ఉండాలని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు. ప్రజల జీవన ప్రమాణాల పెరుగుదలకు గట్టి సినిమా రంగం అవసరం అని, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఇప్పుడు సినీ రంగానికి మళ్లీ జవులు అందించేందుకు కంకణం కట్టిందని తెలిపారు.
అవార్డుల ఎంపికలో భావోద్వేగాలు, పార్టీ నిబంధనలు లేకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని జ్యూరీ సభ్యులను కోరారు. సినిమాలకు మాత్రమే కాకుండా, సినీ పరిశ్రమకు గౌరవం తీసుకువచ్చిన ప్రముఖుల పేరిట అవార్డులు అందించనున్నట్లు తెలిపారు. ఇవి భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలవాలని ఆశాభావం వ్యక్తం చేశారు.