బాలీవుడ్ పరువు తీసిన స్టార్ హీరోయిన్!
- Author : Vamsi Chowdary Korata
Date : 20-02-2026 - 1:58 IST
Published By : Hashtagu Telugu Desk
Regina Cassandra బాలీవుడ్లో తన ప్రయాణం సులభంగా సాగలేదని నటి రెజీనా కసాండ్రా తాజాగా వెల్లడించారు. హిందీ భాషపై మంచి పట్టు ఉన్నప్పటికీ కెరీర్ ప్రారంభంలో తాను కొన్ని అవమానకర పరిస్థితులు ఎదుర్కొన్నానని చెప్పారు. కొందరు మాటలతోనే కాకుండా ప్రవర్తనలోనూ తనను తక్కువగా చూసిన సందర్భాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎక్కువగా చిన్న పాత్రలే వచ్చినా తాను కంటెంట్ ఉన్న వైవిధ్యమైన పాత్రలకే ప్రాధాన్యం ఇచ్చానని తెలిపారు.
దక్షిణాది చిత్రసీమలో అందం, నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రెజీనా కసాండ్రా దాదాపు రెండు దశాబ్దాలుగా సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. చెన్నైలో జన్మించిన ఆమె చిన్న వయసులోనే ఎంటర్టైన్మెంట్ రంగంలోకి అడుగుపెట్టింది. తొమ్మిదేళ్ల వయసులో పిల్లల టీవీ కార్యక్రమానికి యాంకర్గా కెమెరా ముందుకొచ్చిన రెజీనా తమిళ చిత్రం ‘కంద నాళ్ ముదల్’లో బాలనటిగా కనిపించి సినీ రంగంలో ప్రవేశించారు. చదువులోనూ మెరుగైన ప్రతిభ చూపిన రెజీనా సైకాలజీలో ఉన్నత విద్య పూర్తిచేసుకోవడం విశేషం. తెలుగులో ‘శివ మనసులో శృతి’తో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఆమె, ‘రొటీన్ లవ్ స్టోరీ’, ‘కొత్త జంట’, ‘పిల్ల నువ్వు లేని జీవితం’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు పొందింది.
క్యూట్ లుక్స్తో పాటు ఎమోషన్ సీన్స్లోనూ మెప్పించి మంచి ఫాలోయింగ్ సంపాదించింది. తెలుగు మాత్రమే కాకుండా తమిళం, కన్నడ భాషల్లోనూ నటించి సౌత్లో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. కమర్షియల్ సినిమాలతో పాటు స్పెషల్ సాంగ్స్లోనూ కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ చిత్రంలో ఐటెమ్ సాంగ్తో అదరగొట్టింది. తనకు ఇంత అనుభవం ఉన్నప్పటికీ బాలీవుడ్లో తన ప్రయాణం అంత సులభంగా సాగలేదని రెజీనా తాజాగా వెల్లడించారు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో హిందీ చిత్రసీమలో ఎదురైన అనుభవాలను ఆమె ఓపెన్గా షేర్ చేసుకున్నారు. తాను సౌత్ నటి అయినప్పటికీ హిందీ భాషపై మంచి పట్టు ఉందని, అయితే కెరీర్ ప్రారంభంలో అక్కడ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపారు. కొందరు మాటలతోనే కాకుండా వ్యవహారంలోనూ తనను తక్కువగా చూసిన సందర్భాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.
అలాంటి పరిస్థితుల్లో సరైన కథలను ఎంపిక చేసుకోవడం కష్టంగా మారిందని రెజీనా చెప్పింది. ఎక్కువగా ప్రాధాన్యత లేని పాత్రలే వచ్చేవని, అవి చేయడం సులభమే అయినప్పటికీ తాను ప్రధానంగా భిన్నమైన, కంటెంట్ ఉన్న పాత్రలకే ప్రాధాన్యం ఇచ్చానని, మెయిన్స్ట్రీమ్ కమర్షియల్ పాత్రల కంటే వైవిధ్యమైన పాత్రల్లో నటించాలని తాను నిర్ణయించుకున్నానని తెలిపింది. అదే సమయంలో బాలీవుడ్లో అప్పట్లో ఎదురైన పరిస్థితులు ఎప్పటికీ అలాగే ఉండవని, ఇప్పుడు భాషల మధ్య గోడలు తగ్గిపోయాయని కూడా ఆమె అభిప్రాయపడింది.
ప్రస్తుతం రెజీనా పలు ప్రాజెక్టులతో బిజీగా కొనసాగుతోంది. నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘మూకుతి అమ్మన్ 2’లో ఆమె కనిపించనుంది. రెజీనా వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ భారీ కమర్షియల్ సక్సెస్ మాత్రం ఇంకా దక్కలేదనే భావన అభిమానుల్లో ఉంది. అయినప్పటికీ విభిన్న పాత్రలను ఎంచుకుంటూ తనదైన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న ఆమె భవిష్యత్తులో మరింత బలమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.