New Rules: ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్..
- Author : Vamsi Chowdary Korata
Date : 31-03-2026 - 11:33 IST
Published By : Hashtagu Telugu Desk
New Rules from April 1st మార్చి ఇవాళ్టితో ముగుస్తుండగా.. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ క్రమంలోనే చాలా ఆర్థిక మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా టాక్స్ పేయర్లు, బ్యాంక్ కస్టమర్లు వీటి గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇందులో బ్యాంక్ ఛార్జీలు, ఐటీఆర్ ఫైలింగ్, టోల్ ఫీజు, క్రెడిట్ కార్డు మార్పులు ఇలా చాలానే ఉన్నాయి. వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా ప్రతి నెలలోనూ కొత్త కొత్త రూల్స్ వస్తుంటాయి. చాలా వరకు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు ఇలా అన్నీ ఒకటో తేదీ నుంచే కొత్త మార్పుల్ని ప్రకటిస్తుంటాయి. ఇప్పుడు ఆర్థిక సంవత్సరం మార్చితో మారుతున్న క్రమంలో.. ఇంకా చాలా ఆర్థిక మార్పులు రాబోతున్నాయి. 2026, ఏప్రిల్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రూల్స్ అమల్లోకి వస్తున్నాయి. టాక్స్ పేయర్లు సహా బ్యాంక్ కస్టమర్లు, డెబిట్, క్రెడిట్ కార్డులు వాడేవారు, డిజిటల్ పేమెంట్ యూజర్లు, వాహనదారులు ఇలా అందరిపై ఇవి ప్రభావం చూపిస్తుంటాయి. మరి కొత్త ఆర్థిక సంవత్సరంలో రానున్న కొత్త మార్పులు ఏంటో ఇప్పుడు చూద్దాం.
అప్డేటెడ్ ఐటీ రిటర్న్స్- ఇది గతంలో ఫైల్ చేసిన ఐటీ రిటర్న్స్కు సంబంధించి, అందులో తప్పులను సరిదిద్దుకునేందుకు లేదా మర్చిపోయిన ఆదాయాన్ని రిపోర్ట్ చేసి ఐటీఆర్ ఫైల్ చేసేందుకు అవకాశం కల్పిస్తుంది. సాధారణంగా అసెస్మెంట్ ఇయర్ ముగిసిన రెండేళ్లలోపు ఐటీఆర్- యూ ఫైల్ చేయవచ్చు. ఇక్కడ అడిషనల్ టాక్స్, పెనాల్టీ వంటివి పడతాయి. ఏప్రిల్ 1 నుంచే దీనిని దాఖలు చేయవచ్చు.
పాన్ కార్డ్- 2026, మార్చి 31 వరకు పాన్ కార్డు అప్లై చేసేందుకు గుర్తింపు కార్డుగా ఆధార్ కార్డు ఉంటే సరిపోయేది. ఇప్పుడు ఏప్రిల్ 1 నుంచి రూల్స్ మారుతున్నాయి. ఇంకా అదనపు డాక్యుమెంట్లు కావాల్సిందే. పుట్టిన తేదీ ధ్రువపత్రం, ఓటర్ ఐడీ, పదో తరగతి మెమో వంటివి అవసరం పడవచ్చు.
ఎస్బీఐ క్రెడిట్ కార్డు- ఎస్బీఐ కార్డ్ కూడా ఒక కీలక ప్రకటన చేసింది. రివార్డ్స్ పాయింట్స్ రిడెంప్షన్ పాలసీలో మార్పులు చేసింది. రిడీమ్ చేసుకునే విధానంలో మార్పులు చేసింది. నెలకు గరిష్ఠంగా 60 వేల పాయింట్ల పరిమితిని విధించింది. ఇంకా కొన్ని రకాల కార్డుల్లో క్యాష్బ్యాక్ ప్రయోజనాల్లో కూడా కోతలు విధించింది. ఇది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్- ఈ అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ కూడా కీలక మార్పుల్ని ప్రకటించింది. ఇదివరకే లోన్ వడ్డీ రేట్లు తగ్గించి, ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లు పెంచగా, ఇప్పుడు లాకర్ ఛార్జీల్ని కూడా పెంచేసింది. ఇవి ప్రాంతాల్ని బట్టి, లాకర్ సైజును బట్టి మారుతుంటాయి. ఇంకా యూపీఐ ద్వారా ఏటీఎం క్యాష్ విత్డ్రాకు సంబంధించి కూడా పరిమితుల్ని విధించింది. పరిమితి దాటితే పెనాల్టీ పడుతుందని పేర్కొంది. వీటిల్లో కొన్ని ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి రానున్నాయి.
ఫాస్టాగ్ ఫీజు పెంపు – నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరలను సవరించింది. 2026, ఏప్రిల్ 1 నుంచి ధర పెరగనుంది. ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ ధర అంతకుముందు రూ. 3 వేలుగా ఉండగా.. ఇప్పుడు రూ. 3075కు పెరిగింది.
రూపే డెబిట్ కార్డు- రూపే ప్లాటినం డెబిట్ కార్డు హోల్డర్లు ఇక మీదట ఈ ఒక్క కార్డుతోనే ఎయిర్పోర్ట్, ట్రైన్ లాంజ్ల్లోకి ప్రవేశించడానికి వీల్లేదు. లాంజ్ యాక్సెస్కు అనుమతి ఉన్నా ఇక్కడ స్పెండింగ్స్తో ముడిపెట్టింది. నిర్ణీత మొత్తం ఖర్చు పెడితేనే లాంజ్ యాక్సెస్ కల్పిస్తోంది.
ఏటీఎం ఛార్జీలు- పంజాబ్ నేషనల్ బ్యాంక్, బంధన్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వంటి బ్యాంకులు ఏటీఎం క్యాష్ విత్డ్రాయల్ పాలసీల్లో మార్పులను ప్రకటించాయి. వీటిలో ఫీజులు, ఆంక్షలు, పరిమితులు వంటివి ఉన్నాయి. ఈ మార్పులు ఏప్రిల్ 1 నుంచే వర్తిస్తాయి.
2 ఫ్యాక్టర్ అథెంటికేషన్- భారతదేశంలో అన్ని డిజిటల్ చెల్లింపు లావాదేవీలు 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ నిబంధనను తప్పనిసరిగా పాటించాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఏప్రిల్ 1 నుంచి దీనిని పాటించాలని పేర్కొంది.
వీటితో పాటు ఏప్రిల్ నెలలో ఒకటో తేదీన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు, ఏటీఎఫ్, పీఎన్జీ, సీఎన్జీ ధరలు మారవచ్చు. పెట్రోల్, డీజిల్ ధరల్ని కేంద్రం ఇకపై ప్రతి 15 రోజులకు ఓసారి సమీక్షించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐటీఆర్ ఫైలింగ్ కూడా ప్రారంభం కానుంది. ఇప్పటికే కేంద్రం ఐటీఆర్ ఫారమ్స్ను నోటిఫై చేసింది. ఏప్రిల్ 1 నుంచే కొత్త ఆదాయపు పన్ను చట్టం కూడా అమల్లోకి రానుంది.