భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా ?
- Author : Vamsi Chowdary Korata
Date : 03-01-2026 - 11:23 IST
Published By : Hashtagu Telugu Desk
పసిడి ప్రియులకు అలర్ట్. ఇటీవల ఆల్ టైమ్ గరిష్ఠాల నుంచి బంగారం ధర 3 రోజుల్లో భారీగా దిగొచ్చిన సంగతి తెలిసిందే. అయితే మళ్లీ కొత్త సంవత్సరంలో రేట్లు పెరుగుతున్నాయి. ఇప్పుడు రాత్రికి రాత్రే బంగారం, వెండి ధరల్లో భారీ మార్పు కనిపించింది. ప్రస్తుతం గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
- పసిడి ప్రియులకు అలర్ట్
- భారీగా తగ్గి మళ్లీ పెరుగుతున్న గోల్డ్ రేట్లు
- ఇప్పుడు ఎక్కడ ధరలు ఎలా ఉన్నాయంటే?
భారతీయులకు ఎంతో ఇష్టమైన బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. గతేడాది రికార్డు స్థాయిలో గోల్డ్ రేటు ఏకంగా 70 శాతానికిపైగా పెరిగిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా అనిశ్చితి, ముఖ్యంగా పశ్చిమాసియా దేశాల్లో యుద్ధాలు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై భారీగా సుంకాలు విధించడం సహా డాలర్ విలువ తగ్గడం, కేంద్ర బ్యాంకులు విపరీతంగా బంగారం కొనుగోలు చేయడం ఇలా పలు కారణాలతో.. బంగారం సురక్షితమైన పెట్టుబడి సాధనంగా మారింది. బంగారంతో పాటే వెండికి కూడా డిమాండ్ పెరిగింది. వీటిపై విపరీతంగా పెట్టుబడులు పెట్టారు. వెండి ధర ఇంకా 180 శాతం వరకు పెరగడం విశేషం. గరిష్ఠాల నుంచి గతేడాది ఆఖర్లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గిన సంగతి తెలిసిందే.
యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వచ్చే ఏడాది వడ్డీ రేట్లను తగ్గించాలని తొలుత సంకేతాలు వచ్చినప్పటికీ.. తర్వాత వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. దీంతో బంగారం రేట్లు డిసెంబర్ చివర్లో పతనం అయ్యాయి. గరిష్ఠ స్థాయిల నుంచి భారీగా దిగొచ్చాయి. 2026 కొత్త సంవత్సరంలో మళ్లీ పరిస్థితి మొదటికొచ్చింది. వరుసగా 2 రోజుల్లోనూ బంగారం ధర పెరిగింది. ఇప్పుడు రాత్రికి రాత్రే భారీగా ఎగబాకింది. వరుస పతనం నేపథ్యంలో కనిష్ఠాల వద్ద ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.
దేశీయంగా చూస్తే హైదరాబాద్ నగరంలో ఇప్పుడు 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1050 పెరగ్గా తులానికి ప్రస్తుతం రూ. 1,24,850 కి చేరింది. దీనికి ముందటి రోజు రూ. 150 పెరిగింది. అంతకుముందు వరుసగా డిసెంబర్ 29, 30, 31 తేదీల్లో వరుసగా రూ. 2900, రూ. 2800, రూ. 1200 ఇలా రూ. 6900 పతనమైంది. ఇప్పుడు మళ్లీ పెరుగుతుండటం షాకిస్తోంది. ఇదే సమయంలో 24 క్యారెట్ల పసిడి ధర ఇవాళ రూ. 1140 పెరగడంతో 10 గ్రాములకు రూ. 1,36,200 వద్ద ఉంది.
మరోవైపు వెండి ధర చూస్తే ఇప్పుడు ఒక్కరోజులోనే రూ. 4 వేలు పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కేజీకి రూ. 2.60 లక్షలుగా ఉంది. దీనికి ముందు వరుసగా రూ. 1000, రూ. 1000, రూ. 23 వేలు, రూ. 4 వేలు ఇలా రూ. 29 వేలు పతనమైంది.
అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం కిందటి రోజుతో చూస్తే బంగారం, వెండి రేట్లు స్వల్పంగా దిగొచ్చాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 4,332.75 డాలర్ల వద్ద ఉంది. ఇంట్రాడేలో ఒక దశలో 4,400 డాలర్ల స్థాయికి చేరినా మళ్లీ వెనక్కి తగ్గింది. సిల్వర్ రేటు 73 డాలర్ల స్థాయి నుంచి ఒక దశలో 71 డాలర్ల స్థాయికి చేరినా చివరకు 72.86 డాలర్ల వద్ద స్థిరపడింది. చివరగా డాలరుతో పోలిస్తే ప్రస్తుతం రూపాయి మారకం విలువ రూ. 90.19 వద్ద కొనసాగుతోంది.