Changes In September: సెప్టెంబర్లో మనం చేయాల్సిన ముఖ్యమైన పనులీవే!
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) పరిధిలోకి వచ్చే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS)ను ఎంచుకోవడానికి సెప్టెంబర్ 30 వరకు గడువు ఉంది.
- Author : Gopichand
Date : 30-08-2025 - 3:30 IST
Published By : Hashtagu Telugu Desk
Changes In September: సెప్టెంబర్ 2025 నుండి అనేక ఆర్థిక మార్పులు (Changes In September) రానున్నాయి. ఈ మార్పులు దేశవ్యాప్తంగా ప్రజల నెలవారీ బడ్జెట్పై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభావం చూపుతాయి. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఛార్జీల పెంపు, ఎల్పీజీ ధరలలో తగ్గింపు, ఎఫ్డీ వడ్డీ రేట్ల తగ్గింపు వంటి ముఖ్యమైన మార్పులు ఉన్నాయి. వీటితో పాటు ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు, ఆధార్ కార్డు అప్డేట్ వంటి కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి.
వెండికి తప్పనిసరి హాల్మార్కింగ్
ప్రభుత్వం సెప్టెంబర్ నుంచి బంగారంతో పాటు వెండికి కూడా హాల్మార్కింగ్ను తప్పనిసరి చేయాలని యోచిస్తోంది. అయితే హాల్మార్క్ ఉన్న వెండి ఆభరణాలు లేదా వస్తువులను కొనుగోలు చేయడం తప్పనిసరి కాదు. కానీ ఈ నిర్ణయం వెండి ధరలపై ప్రభావం చూపుతుంది. ఇది బంగారానికి బదులుగా వెండిలో పెట్టుబడి పెట్టేవారిపై ప్రభావం చూపుతుంది.
ఎస్బీఐ క్రెడిట్ కార్డ్లో మార్పులు
సెప్టెంబర్ నుంచి ఎస్బీఐ తన క్రెడిట్ కార్డ్ నిబంధనలలో మార్పులు చేయనుంది. డిజిటల్ గేమింగ్ ప్లాట్ఫారమ్లు, కొన్ని వాణిజ్య, ప్రభుత్వ లావాదేవీలపై ఇకపై రివార్డ్ పాయింట్లు ఇవ్వదు. ఆటో డెబిట్ విఫలమైతే ఎస్బీఐ 2 శాతం జరిమానా కూడా విధించవచ్చు.
Also Read: E20 Fuel Policy: సుప్రీంకోర్టుకు చేరిన E20 ఇంధన విధానం.. అసలు ఈ20 ఇంధనం అంటే ఏమిటి?
ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలలో మార్పులు
ప్రతినెలా మాదిరిగానే సెప్టెంబర్లో కూడా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలలో మార్పులు ఉంటాయి. దేశీయ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి. సెప్టెంబర్ 1న చమురు సంస్థలు కొత్త ధరలను ప్రకటించనున్నాయి. గత నెలలో ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ ఈ నెలలో మార్పులు ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా సీఎన్జీ, పీఎన్జీ ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది.
ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లలో తగ్గింపు
సెప్టెంబర్లో ఫిక్స్డ్ డిపాజిట్ (FD) రేట్లలో తగ్గింపు ఉండే అవకాశం ఉంది. అనేక బ్యాంకులు తమ ఎఫ్డీ రేట్లను సమీక్షించి వాటిలో మార్పులు చేయాలని యోచిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో చాలా బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై 6.5 నుండి 7.5 శాతం వరకు వడ్డీ రేటును ఇస్తున్నాయి. ఎఫ్డీలపై వడ్డీ రేట్లు తగ్గించవచ్చని సమాచారం.
ఏటీఎంల వినియోగంపై కొత్త నియమాలు
దేశవ్యాప్తంగా కొన్ని బ్యాంకులు ఏటీఎంల వినియోగంపై కొత్త నిబంధనలను అమలు చేయనున్నాయి. నిర్దేశించిన నెలవారీ పరిమితికి మించి ఏటీఎంల నుంచి డబ్బులు తీసే కస్టమర్లు ఎక్కువ లావాదేవీల రుసుమును చెల్లించాల్సి రావచ్చు. ఈ అదనపు ఖర్చులను నివారించడానికి అనవసరమైన ఏటీఎం లావాదేవీలను తగ్గించుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇది నేరుగా నెలవారీ బడ్జెట్పై ప్రభావం చూపుతుంది.
ముఖ్యమైన తేదీలు
- ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 15, 2025.
- నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) పరిధిలోకి వచ్చే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS)ను ఎంచుకోవడానికి సెప్టెంబర్ 30 వరకు గడువు ఉంది.
- ఆధార్ కార్డును ఉచితంగా అప్డేట్ చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 14. యూఐడీఏఐ ఈ గడువును మూడు నెలలు పొడిగించింది.