YS Sharmila : రాజారెడ్డి, YSR పేర్లపై రాజకీయాలు చేయొద్దు.. టీడీపీకి షర్మిల కౌంటర్
- Author : Prasad
Date : 26-05-2026 - 2:32 IST
Published By : Hashtagu Telugu Desk
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ రాజారెడ్డి పేర్లను రాజకీయంగా ఉపయోగిస్తున్నారంటూ టీడీపీపై వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తమపై జరుగుతున్న ప్రచారం రాజకీయ అక్కసుతో చేస్తున్నదేనని ఆమె ఆరోపించారు. దివంగతులపై ఆరోపణలు చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నించడం సరికాదని షర్మిల పేర్కొన్నారు. నిజంగా ఆరోపణల్లో వాస్తవం ఉంటే గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు విచారణ చేపట్టలేదని ప్రశ్నించారు. ప్రస్తుతం కూడా అధికారంలో ఉండి రెండేళ్లు అవుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. వైఎస్ రాజారెడ్డి కడప జిల్లాలో పేదల కోసం ఆసుపత్రులు, విద్యాసంస్థలు ఏర్పాటు చేసి సేవలు అందించారని షర్మిల గుర్తు చేశారు. అలాగే వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు సేవలందించిన మహానేత అని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, రైతులకు ఉచిత విద్యుత్ వంటి పథకాలను ఆమె ప్రస్తావించారు. దివంగత నేతల చరిత్రను వక్రీకరించి ప్రజల మనసుల్లో వారి స్థానాన్ని తగ్గించలేరని షర్మిల స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టాలని అధికార పార్టీకి సూచించారు