Naa Anveshana Anvesh : మంత్రి లోకేష్కు యూట్యూబర్ అన్వేష్ రిక్వెస్ట్
ప్రముఖ తెలుగు యూట్యూబర్, ట్రావెల్ వ్లాగర్ నా అన్వేషణ అన్వేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యావ్యవస్థ మరియు అక్షరాస్యతపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఒక వీడియో విడుదల చేశారు.
- Author : Sudheer
Date : 16-03-2026 - 3:45 IST
Published By : Hashtagu Telugu Desk
Naa Anveshana Anvesh : ప్రముఖ తెలుగు యూట్యూబర్, ట్రావెల్ వ్లాగర్ నా అన్వేషణ అన్వేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యావ్యవస్థ మరియు అక్షరాస్యతపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఒక వీడియో విడుదల చేశారు. దక్షిణ భారతదేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యతలో వెనుకబడి ఉండటంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా 2025 గణాంకాల ప్రకారం, అక్షరాస్యత రేటులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అట్టడుగున ఉండటం, చివరకు బీహార్ కంటే కింద ఉండటం శోచనీయమని పేర్కొన్నారు. “విద్య లేని వాడు వింత పశువు” అనే సామెతను గుర్తు చేస్తూ, రాష్ట్ర భవిష్యత్తు చదువుపైనే ఆధారపడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
అన్వేష్ తన వ్యక్తిగత జీవితాన్ని ఉదాహరణగా చూపిస్తూ విద్య యొక్క ప్రాముఖ్యతను వివరించారు. విశాఖపట్నంలోని పూర్ణా మార్కెట్ సమీపంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న తాను, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో టెన్త్, ఇంటర్, డిగ్రీ మరియు ఎంబీఏ పూర్తి చేసి అమెరికాలో ఉద్యోగం సాధించగలిగానని గుర్తు చేసుకున్నారు. చదువు ద్వారానే తన దారిద్ర్యం తొలగిపోయిందని, తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఇప్పటి వరకు వెయ్యి మందికి పైగా విద్యార్థులకు అమెరికాలో ఉద్యోగ అవకాశాలు లభించేలా అవగాహన కల్పించానని వెల్లడించారు. కందుకూరి వీరేశలింగం పంతులు వంటి సంస్కర్తలు పుట్టిన గడ్డపై అక్షరాస్యత శాతం తక్కువగా ఉండటం తగదని ఆయన అభిప్రాయపడ్డారు.
భారతదేశం విద్యపై చేస్తున్న ఖర్చును ఇతర దేశాలతో అన్వేష్ పోల్చి చూపారు. అమెరికా విద్య కోసం 1,000 బిలియన్ డాలర్లు, చైనా 800 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తుంటే, 140 కోట్ల జనాభా ఉన్న భారత్ కేవలం 16 బిలియన్ డాలర్లు మాత్రమే ఖర్చు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 4 కోట్ల జనాభా ఉన్న మలేషియా వంటి చిన్న దేశం కూడా మనకంటే ఎక్కువగా (22 బిలియన్ డాలర్లు) విద్యపై వెచ్చిస్తోందని గణాంకాలతో వివరించారు. ఈ నేపథ్యంలో, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని ప్రభుత్వం వచ్చే ఏడాది నాటికి ఏపీని అక్షరాస్యతలో అగ్రస్థానానికి చేర్చేలా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.