Vallabhaneni Vamsi : రెండో రోజు ముగిసిన వల్లభనేని వంశీ విచారణ
వైద్య పరీక్షల అనంతరం మళ్లీ తిరిగి జైలుకు తరలించనున్నారు. నిన్న పోలీసులు అడిగిన ప్రశ్నలకు వంశీ సరైన సమాధానం చెప్పలేదు. దీంతో అధికారులు ఈ రోజు టెక్నికల్ ఎవిడెన్సులు చూపించి ప్రశ్నలు అడిగి సమాధానం రాబట్టే ప్రయత్నం చేశారు.
- Author : Latha Suma
Date : 26-02-2025 - 4:44 IST
Published By : Hashtagu Telugu Desk
Vallabhaneni Vamsi : టీడీపీ కార్యాలయంపై దాడి కేసు, కార్యాలయ సిబ్బంది కిడ్నాప్కేసులో రిమాండ్లో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ విచారణ రెండో రోజు ముగిసింది. వంశీని మూడు గంటలకు పైగా విచారించారు. అనంతరం వంశీని వైద్య పరీక్షలు నిమిత్తం పోలీసులు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళారు. వైద్య పరీక్షల అనంతరం మళ్లీ తిరిగి జైలుకు తరలించనున్నారు. నిన్న పోలీసులు అడిగిన ప్రశ్నలకు వంశీ సరైన సమాధానం చెప్పలేదు. దీంతో అధికారులు ఈ రోజు టెక్నికల్ ఎవిడెన్సులు చూపించి ప్రశ్నలు అడిగి సమాధానం రాబట్టే ప్రయత్నం చేశారు.
Read Also: Plane crash : సూడాన్లో కూలిన సైనిక విమానం.. 46 దుర్మరణం
సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపులు వెనుక ఎవరెవరూ ఉన్నారు అనే కోణంలో పోలీసులు ప్రశ్నాస్తాలు సంధించారు. సత్యవర్ధన్ను హైదరాబాద్ నుంచి విశాఖకు తీసుకుని వెళ్ళినప్పుడు ఎవరెవరు ఉన్నారని పోలీసులు ప్రశ్నించారు. ఇక, విచారణలో భాగంగా వంశీని 20 ప్రశ్నలను పోలీసులు అడిగారు. తనపై ఉన్న కేసులు తప్పుడువేనని వంశీ చెప్పినట్లు సమాచారం. తనపై కేసులు అన్ని ఆరోపణలేనని.. కేసులు ఎందుకు పెడుతున్నారో అందరికీ తెలిసిందేనని చెప్పినట్లు సమాచారం.
కాగా, మరో 14 రోజుల పాటు వంశీ రిమాండ్ను పొడిగిస్తూ ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ కార్యాలయంలో పనిచేసే సత్యవర్ధన్ను బెదిరించి, కిడ్నాప్ చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో వంశీకి జ్యుడీషియల్ రిమాండ్ ముగిసింది. దీంతో వంశీతో పాటు మరో నలుగురిని పోలీసులు మంగళవారం వర్చువల్గా న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. వీరికి మార్చి 11 వరకు రిమాండ్ను పొడిగించారు.
Read Also: YSRCP: జగన్ కంటే బొత్స బెటర్… వైసీపీలో కీలక పరిణామం….!!