TTD Admissions 2026: టీటీడీ సంగీత, నృత్య అడ్మిషన్లు దరఖాస్తులకు ఆహ్వానం
- Author : Vamsi Chowdary Korata
Date : 01-06-2026 - 12:40 IST
Published By : Hashtagu Telugu Desk
టీటీడీ సంగీతం, డ్యాన్స్ నేర్చుకోవాలనుకునేవారికి అద్భుత అవకాశం కల్పిస్తోంది. జూన్ 3వ తేదీ నుంచి తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించబడే ఎస్వీ సంగీత, నృత్య కళాశాల మరియు నాదస్వర పాఠశాలలో 2026-2027 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. దరఖాస్తు కోసం రూ.50/- చెల్లించాలని టీటీడీ సూచిస్తోంది.
ఏపీలో సంగీతం నేర్చుకోవాలనుకునేవారికి టీటీడీ అద్భుత అవకాశం కల్పించింది. తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల, ఎస్వీ నాదస్వరం, డోలు పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి పలు రెగ్యులర్ కోర్సుల్లో ప్రవేశాలు ప్రారంభం కానున్నాయి. జూన్ 3వ తేదీ నుంచి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. https://news.tirumala.org/applications-invited-for-admissions-to-sv-music-dance-college-and-nadaswaram-school-from-june-3 ఈ మేరకు విద్యార్థులు కాలేజీలో దరఖాస్తులు పొందవచ్చు. వాటిని వెంటనే పూర్తి చేసి దరఖాస్తులు అందజేయాలి. ఈ నెల 30వ తేదీ వరకు స్వీకరిస్తారని టీటీడీ తెలిపింది.
తిరుపతి శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల, ఎస్వీ నాదస్వరం, డోలు పాఠశాలలో ఫుల్ టైమ్ / పార్ట్ టైమ్ వ్యవధి గల కోర్సులలో గాత్రం, వీణ, వేణువు, వయోలిన్, నాదస్వరం, డోలు, భరతనాట్యం, కూచిపూడి నృత్యం, హరికథ, మృదంగం, ఘటం విభాగాలు ఉన్నాయి. బి.మ్యూజిక్, బి.డ్యాన్స్, విశారద, ప్రవీణ కోర్సులు ఉన్నాయి. ఎస్వీ నాదస్వర పాఠశాలలో సర్టిఫికేట్, డిప్లొమా రెగ్యులర్ కోర్సులతో పాటు సాయంత్రం కళాశాల పార్ట్ టైమ్ కోర్సులు ఉన్నాయని టీటీడీ తెలిపింది.
ఆసక్తి గల అభ్యర్థులు కళాశాల కార్యాలయ పనివేళల్లో రూ.50/- చెల్లించి దరఖాస్తు పొందవచ్చు. రెగ్యులర్ కోర్సులకు 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. సాయంత్రం కళాశాలకు 5వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. రెగ్యులర్ కోర్సు చదివే విద్యార్థులకు మాత్రమే నిబంధనలకు లోబడి హాస్టల్ వసతి కల్పించబడుతుంది. ఇతర వివరాలకు 0877-2264597, 9848374408, 9440793205, 9642796991 నంబర్లలో సంప్రదించాలి అని టీటీడీ సూచించింది.
తిరుమలలో పౌర్ణమి గరుడసేవ
తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం రాత్రి పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు ధగధగా మెరిసిపోతున్న గరుడునిపై తిరుమల వీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజేస్తారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ చినజీయర్ స్వామి, టీటీడీ బోర్డు సభ్యులు శాంతారామ్, జేఈవో (ఆరోగ్యం & విద్య) డాక్టర్ శరత్, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో నాల్గవ రోజైన ఆదివారం రాత్రి, స్వామివారు సర్వభూపాల వాహనంపై శ్రీరామ పట్టాభిషేక ఘట్టంలోని సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రుని దివ్య అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చి అనుగ్రహించారు. అనంత తేజోమూర్తి అయిన శ్రీనివాసుడు సర్వలోకాల పాలకుడిగా, రాజాధిరాజుగా సర్వభూపాల వాహనంపై విహరిస్తూ భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తారు. స్వామివారి దివ్య మంగళ విగ్రహాన్ని దర్శించిన భక్తులు గోవింద నామస్మరణలతో ఆలయ పరిసరాలను మార్మోగించారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తించగా, మంగళవాయిద్యాల నడుమ వాహనసేవ అత్యంత వైభవంగా సాగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పిస్తూ స్వామివారి కృపాకటాక్షాలను పొందారు. “సర్వభూపాలులు” అంటే సమస్త రాజులు అని అర్థం. ప్రజలను ధర్మమార్గంలో నడిపించి వారి సంక్షేమాన్ని కాంక్షించే రాజులందరికీ అధిపతి భగవంతుడే అనే సనాతన సందేశాన్ని ఈ వాహనసేవ చాటిచెబుతుంది. జగన్నాయకుడైన శ్రీహరి సమస్త భూపాలులను పరిపాలించే రాజాధిరాజుగా ఈ వాహనంపై దర్శనమిస్తారు.