Renuka Chowdhury: ఇది రాజధాని రైతుల విజయం.రేణుకా చౌదరి
- Author : Vamsi Chowdary Korata
Date : 02-04-2026 - 2:26 IST
Published By : Hashtagu Telugu Desk
Renuka Chowdhury ఏపీ రాజధాని బిల్లు అమరావతి రైతుల విజయమని రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి అభివర్ణించారు. గురువారం రాజ్యసభలో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుపై జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు. ఉద్యమ సమయంలో రైతులు, మహిళలను తీవ్రంగా హింసించినా, వారు వెనకడుగు వేయకుండా పోరాటం కొనసాగించారని గుర్తు చేశారు.
గత 12 ఏళ్లుగా ఏపీ రాజధానిపై కొనసాగుతున్న అస్పష్టత వల్లే రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయని రేణుకా చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని రాజధాని లేకుండా చేశారని ఆమె విమర్శించారు. కేవలం బిల్లు పెట్టడమే కాదు, నిర్ణీత సమయంలో రాజధానిని పూర్తి చేసి చూపించాలని డిమాండ్ చేశారు.
విభజన హామీల విషయంలో కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాలతో ఆటలాడుతోందని ఆమె మండిపడ్డారు. దుగరాజపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్ను ముగిసిన అధ్యాయాలుగా మార్చేశారని విమర్శించారు. తెలంగాణకు హామీ ఇచ్చిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఎన్టీపీసీలను కూడా కేంద్రం ఇవ్వలేదని తెలిపారు. ఇన్నేళ్లయినా హామీలు ఎందుకు నెరవేర్చలేదో కేంద్రం సమాధానం చెప్పాలని, రెండు రాష్ట్రాలకు పరిహారం ఇవ్వాలని కోరారు.
రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు గడిచినా, లక్షా 47 వేల కోట్ల విలువైన ఆస్తుల పంపకాలు ఇంకా పూర్తి కాలేదని ఆమె గుర్తు చేశారు. భౌగోళికంగా ఏపీలో ఉన్న ఐదు గ్రామాల ప్రజలు తెలంగాణలో ఉండాలని కోరుకుంటున్నా, వారిని ఏపీలో కలపడంతో ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పరిస్థితులు ఎలా ఉన్నా, రెండు తెలుగు రాష్ట్రాలు కలిసే ముందుకు సాగాల్సిన అవసరం ఉందని రేణుకా చౌదరి తన ప్రసంగాన్ని ముగించారు.