Thalliki Vandanam 2nd List : రేపే ‘తల్లికి వందనం’ రెండో విడత నిధులు విడుదల
Thalliki Vandanam 2nd List : ఈ పథకంలో తమకు అర్హత ఉందో లేదో తెలుసుకోవాలనుకుంటే పౌరులు https://gsws-nbm.ap.gov.in/ వెబ్సైట్కి వెళ్లి "తల్లికి వందనం" పథకాన్ని సెలెక్ట్ చేసి, విద్యార్థి తల్లి ఆధార్ నంబర్ను నమోదు చేయాలి
- Author : Sudheer
Date : 09-07-2025 - 10:55 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని చేపట్టిన ‘తల్లికి వందనం’ (Thalliki Vandanam) పథకం రెండో విడత నిధుల విడుదలకు రంగం సిద్ధమైంది. రేపు గురువారం (జులై 10న) రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నిధులను జమ చేయనుంది. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేయడంతో పాటు, ఈ నెల 2వ తేదీ లోపు పాఠశాలలో చేరిన విద్యార్థుల వివరాలను పరిశీలించారు. అర్హుల జాబితాలు గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచారు.
ఈ రెండో విడతలో సుమారు 10 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా మొదటి తరగతి మరియు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో చేరిన విద్యార్థుల తల్లులకు ఈ నిధులు అందజేయనున్నారు. మొదటి విడతలో అర్హత ఉండీ, ఏవో సాంకేతిక కారణాలతో నిధులు జమ కాకపోయిన వారికి ఈ విడతలో మరో అవకాశం కల్పించనున్నారు. ముఖ్యంగా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నవారు, ఆధార్ వివరాలు తప్పుగా నమోదైన వారు – ఈ విడతలో నిధులు పొందనున్నారు.
Second Hand Cars : సెకండ్ హ్యాండ్ కార్స్ కొనడం వల్ల లాభాలు , నష్టాలు ఇవే !!
విద్యాహక్కు చట్టం కింద ప్రవేశం పొందిన సుమారు 46 వేల మంది విద్యార్థులకు నిధులు వారి తల్లులకు కాకుండా నేరుగా పాఠశాలల ఖాతాలకు జమ చేయనున్నారు. మొత్తం మీద 11 లక్షల మందికి పైగా విద్యార్థుల వివరాలను పాఠశాల విద్యాశాఖ సేకరించి సచివాలయ శాఖకు పంపింది. అందులోని అర్హుల వడపోత అనంతరం 10 లక్షల మందికి పథకం అమలు కానుంది. ఇదివరకే జూన్ 12న మొదటి విడత నిధులు విడుదల చేసిన ప్రభుత్వం, ఈసారి జులై 10న మెగా పేరెంట్-టీచర్స్ మీటింగ్ సందర్భంగా రెండో విడత నిధుల విడుదలను నిర్ణయించింది.
ఈ పథకంలో తమకు అర్హత ఉందో లేదో తెలుసుకోవాలనుకుంటే పౌరులు https://gsws-nbm.ap.gov.in/ వెబ్సైట్కి వెళ్లి “తల్లికి వందనం” పథకాన్ని సెలెక్ట్ చేసి, విద్యార్థి తల్లి ఆధార్ నంబర్ను నమోదు చేయాలి. అలాగే మనం మిత్రం వాట్సాప్ నంబర్ +91 9552300009 ద్వారా కూడా అర్హుల జాబితాలో తమ పేరు ఉందో లేదో తెలుసుకునే సౌలభ్యం కల్పించారు. ఇది ద్వారా ప్రభుత్వం ఇచ్చిన హామీని పూర్తిగా అమలు చేస్తూ, మరింత మందికి ప్రయోజనం కలిగించాలని లక్ష్యంగా పెట్టుకుంది.