Nara Lokesh : ఆ విద్యార్థులకు కూడా తల్లికి వందనం.. మంత్రి లోకేష్ కీలక ప్రకటన
Nara Lokesh : విద్యా సంవత్సరం ప్రారంభ సందర్భంగా రాష్ట్ర విద్యార్థులకు శుభాకాంక్షలు, తల్లులకు అభినందనలు తెలుపుతూ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు.
- Author : Kavya Krishna
Date : 11-06-2025 - 8:50 IST
Published By : Hashtagu Telugu Desk
Nara Lokesh : విద్యా సంవత్సరం ప్రారంభ సందర్భంగా రాష్ట్ర విద్యార్థులకు శుభాకాంక్షలు, తల్లులకు అభినందనలు తెలుపుతూ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఒక సంవత్సరం విజయవంతంగా పూర్తిచేసుకున్న సందర్భంగా, మరో కీలక ఎన్నికల హామీ అయిన “తల్లికి వందనం” పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు నారా లోకేష్ తెలిపారు.
Railway Project: ఏపీకి మరో గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం!
సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఉన్న ఈ పథకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చాలా సంతోషకరమన్నారు. అయితే.. ఈ పథకం కింద 67,27,164 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో మొత్తం రూ. 8,745 కోట్లు జమ చేయనున్నారు. 1వ తరగతిలో అడ్మిషన్ తీసుకున్న పిల్లలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరిన విద్యార్థుల తల్లులు కూడా ఈ పథకం ప్రయోజనాలు పొందగలుగుతారు.
ఇప్పటికే పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్, మెగా డీఎస్సీ, దీపం-2 వంటి పథకాలను విజయవంతంగా అమలు చేసిన ప్రభుత్వం, ఇప్పుడు “తల్లికి వందనం” పథకాన్ని ప్రారంభించి మరో కీలక హామీని నెరవేర్చిందని లోకేష్ తెలిపారు. విద్యారంగానికి ప్రాధాన్యం ఇస్తూ తల్లుల పాత్రను గౌరవిస్తూ తీసుకొచ్చిన ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి విశేష స్పందనను పొందుతోంది. ఈ పథకం ద్వారా విద్యార్థుల చదువును ప్రోత్సహించడంతో పాటు, తల్లుల ఆర్థిక భద్రతను కూడా ప్రభుత్వం పటిష్టం చేయనుంది.