Srikakulam History : 75వ వసంతంలోకి శ్రీకాకుళం జిల్లా.. చారిత్రక వివరాలివీ
సూటిగా చెప్పాలటే ఉమ్మడి మద్రాసు రాష్ట్రం ఉన్న టైంలోనే ఈ జిల్లా ఏర్పాటైంది.
- Author : Pasha
Date : 18-08-2024 - 11:59 IST
Published By : Hashtagu Telugu Desk
Srikakulam History : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు కంటే ముందే శ్రీకాకుళం జిల్లా ఏర్పడింది. సూటిగా చెప్పాలటే ఉమ్మడి మద్రాసు రాష్ట్రం ఉన్న టైంలోనే ఈ జిల్లా ఏర్పాటైంది. అదెలా అంటే.. ఆ సమయానికి విశాఖపట్నం జిల్లాలో భాగంగానే శ్రీకాకుళం ఏరియా అంతా ఉండేది. 1950 సంవత్సరంలో పాలనా సౌలభ్యం కోసం విశాఖపట్నం జిల్లా నుంచి విడదీసి, శ్రీకాకుళం జిల్లాను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అప్పట్లో శ్రీకాకుళం జిల్లా విస్తీర్ణం కూడా చాలా ఎక్కువగా ఉండేది. అయితే 1969 నవంబరులో ఈ జిల్లాలోని సాలూరు తాలూకా నుంచి 63 గ్రామాలను , బొబ్బిలి తాలూకా నుంచి 44 గ్రామాలను విశాఖపట్నం జిల్లాలోని గజపతినగరం తాలూకాకు బదిలీ చేశారు. మళ్లీ 1979 మేలో సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం, చీపురుపల్లి తాలూకాలను కలిపి విజయనగరం జిల్లాను ఏర్పాటు చేశారు.
We’re now on WhatsApp. Click to Join
- శ్రీకాకుళం జిల్లా(Srikakulam History) నుంచి వి.వి.గిరి వంటి వారు జాతీయ నాయకులుగా ఎదిగారు.
- ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన పాత్రో తర్వాత కాలంలో ఒడిశా వాసిగా మారారు. ఆయన హయాంలోనే విశాఖలో ఆంధ్ర యూనివర్సిటీ ఏర్పడింది.
- ఎన్జీ రంగా, ఎన్టీ రామారావు వంటి వారిని ఈ ప్రాంతమే రాజకీయంగా ఆదుకుంది.
Also Read :Nirmala Sitharaman Biography: నిర్మలా సీతారామన్ రాజకీయ ప్రస్థానం
- షుగర్ ఫ్యాక్టరీ అంటే మనందరికీ గుర్తొచ్చేది శ్రీకాకుళం జిల్లాలోని ఆమదాలవలస షుగర్ ఫ్యాక్టరీ. ప్రభుత్వ నిధులు, రైతుల షేర్ ధనంతో ఏర్పాటైన ఫ్యాక్టరీ ఇది. 1958లో దీని శంకుస్థాపన జరిగింది. ఇది కొన్ని దశాబ్దాల పాటు జిల్లా చెరకు రైతాంగానికి ఊపిరిపోసింది.
- ఆముదాలవలస షుగర్స్ను మూసివేసి.. సంకిలి వద్ద ప్రైవేట్ రంగంలో షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభించారు. ప్రతి ఎన్నికల ముందూ ఆముదాలవలస షుగర్స్ ఓ నినాదంగా మారుతోంది.
- బ్రిటీష్ పాలనా కాలంలో రాజాం, సిరిపురం, పొందూరు పరిసర ప్రాంతాల్లో నేత పరిశ్రమ బాగా ఉండేది.
- రాజాంలో ఆడవారి కోసం తయారుచేసే తెల్లటి దుస్తులు ఎంతో పేరొందాయి.
- రాజాం పరిసర ప్రాంతాల్లో తయారయ్యే దుస్తులను బరంపురం, కటక్, కలకత్తా వంటి దూర ప్రాంతాలకు ఎగుమతి చేసేవారు.
- శ్రీకాకుళం నుంచి హైదరాబాదుకు గొప్ప వర్తకం జరిగేది.
- శ్రీకాకుళంలో మిక్కిలి సన్నని మజిలిస్ తానులు నేసి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేవారు. ఈ జిల్లాలో తయారయ్యే ఖాదీ వస్రాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
- శ్రీకాకుళం జిల్లాలో చేతితో తయారయ్యే ఖాదీ వస్రాల నాణ్యత గాంధీజీనే అబ్బురపర్చింది. చేతితో తయారయ్యే వస్త్రాలంటే నమ్మలేక, పరిశీలించడానికి ఆయన తన ప్రతినిధి పంపించారు. అనంతరం వీటిని ప్రశంసిస్తూ హరిజన పత్రికలో గాంధీజీ వ్యాసం రాశారు.